ట్రంప్ నిర్ణయానికి జోబిడెన్ బ్రేకులు, H1B వీసాపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి విదేశీయులకు ఇచ్చే H1B వీసాల మంజూరు ప్రక్రియలో ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని జోబిడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా తెలిపింది. డిసెంబర్ 31వ తేదీ వరకు లాటరీ విధానమే అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) తెలిపింది.
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
వీసాల జారీ
H1B వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి జోబిడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో వేతనాలు, ప్రతిభ ఆధారంగా వాటిని జారీ చేసేందుకు వీలుగా ట్రంప్ హయాంలో తెచ్చిన కొత్త విధానం అమలును వాయిదా వేసినట్లే. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పాత లాటరీ విధానంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
H1B అనేది వలసేతర వీసా. అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ USCIS ప్రతి సంవత్సరం ఈ వీసాలను గరిష్టంగా 65వేల వరకు జారీ చేస్తుంది. ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం(STEM) విభాగాల్లో ఉన్నత విధ్య పూర్తి చేసిన వారికి అదనంగా మరో 20వేల వరకు వీసాలు జారీ చేస్తుంది.
వాయిదా
H1B వీసా కింద అమెరికాలో పలు టెక్నాలజీ సంస్థలు భారత్, చైనా ఇతర దేశాలనుంచి వేలాదిమందిని ఉద్యోగాల్లో తీసుకుంటాయి. ట్రంప్ హయాంలో ఉండగా ఈ వీసాల జారీ ప్రక్రియలో కంప్యూటరైజ్డ్ లాటరీకి స్వస్తి చెప్పి ప్రతిభ ఆధారిత విధానం తీసుకొచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులకు మరింత సమయాన్నిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కొత్త విధానం అమలును మార్చి 9 నుండి డిసెంబర్ 31కి వాయిదా వేసింది.
అందుకే పొడిగింపు
కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలకు విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకుంటూ H1B వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేతనాలు అధిక నైపుణ్యాలు, అత్యధిక వేతనాలు ఉన్న విదేశీయులకే ఆ వీసాలను జారీ చేయాలని ట్రంప్ హయాంలో నిర్ణయించారు.
కంప్యూటరైజ్డ్ లాటరీ విధానానికి స్వస్తీ పలుకుతూ ఏడాది జనవరి 7న USCIS ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే కొత్త విధానానికి సంబంధించి నిబంధనల రూపకల్పనకు, వాటిని పరీక్షించేందుకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మరింత సమయం అవసరమని జోబిడెన్ సర్కార్ అభిప్రాయపడింది. అందుకే దీనిని పొడిగించింది. కాగా, లాటరీ ఫలితాలు మార్చి 31 నాటికి వెల్లడి కానున్నాయి.