18లక్షలకోట్లు పెరిగింది: జెఫ్ బెజోస్, ఇండియన్ జైచౌదరి అదుర్స్, భారీగా తగ్గిన ట్రంప్ సంపద
2020 సంవత్సరానికి గాను అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. Forbes 400 జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మొదటిస్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు బెజోసే. వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా కుబేరుల జాబితాలో అలీస్ వాల్టన్ ఒకే ఒక మహిళ చోటు దక్కించుకున్నారు. ఈమె నెట్ వర్త్ 62.3 బిలియన్ డాలర్లు. అమెరికాలో 10వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జూలై 24వ తేదీ వరకు కటాఫ్ తేదీతో ఈ జాబితాను ప్రకటించింది.
భార్యాభర్తలు ఉద్యోగం వదిలేసి: అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో 7గురు భారతీయులు
57 శాతం పెరిగిన బెజోస్ ఆస్తులు
జెఫ్ బెజోస్ ఆస్తులు ఏడాదిలో 57 శాతం పెరిగి 179 బిలియన్ డాలర్లకు పెరిగింది. Forbes 400 జాబితాలో మరెవరి సంపద కూడా వ్యాల్యూపరంగా ఇంతలా పెరగలేదు. పర్సెంటేజీ పరంగా భారీగా కూడబెట్టింది ఎలాన్ మస్క్. అతని సంపద 242 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో ఈ 400 మంది సంపద భారీగా పెరిగింది. అయితే ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరూ లాభపడలేదు. వారెన్ బఫెట్, షెల్డాన్ అడెల్సన్ వంటి వారు సంపదను కోల్పోయారు. 400 మంది బిలియనీర్ల సంపద 12 నెలల కాలంలో 240 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే దాదాపు 18 లక్షల కోట్లు పెరిగింది. కరోనా మహమ్మారి సమయంలో జెఫ్ బెజోస్ వంటి వారి సంపద భారీగా పెరిగింది. అలాగే కొన్ని కంపెనీల ఆదాయం పడిపోయింది.
టాప్ 5.. ఎలాన్ మస్క్ జంప్
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 111 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ 85 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బెర్క్షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్ 73.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్ 72 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు.
టాప్ 400లోని మొదటి 15 మంది కుబేరుల సంపద 40 శాతం మేర పెరిగింది.
ఫోర్బ్స్ సమాచారం సేకరించిన జూలై 24వ తేదీ వరకు టెస్లా స్టాక్స్ 520 శాతం పెరిగాయి. దీంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపద 48.1 బిలియన్ డాలర్లు పెరిగింది. ఎలాన్ మస్క్ గత ఏడాది 19.9 బిలియన్ డాలర్లతో 23వ స్థానంలో ఉండగా, ఈసారి 68 బిలియన్ డాలర్లతో 7వ స్థానానికి ఎగబాకాడు.
ఇండియన్ జైచౌదరి ఆస్తులు భారీగా పెరిగాయి
న్విదియా కోఫౌండర్, సీఈవో జెన్సెన్ హాంగ్ సంపద గత ఏడాదితో పోలిస్తే 133 శాతం పెరిగి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టాప్ గెయినర్స్ జాబితాలో హాంగ్ ఉన్నారు.
అలాగే, అమెరికాలోని టాప్ 400 జాబితాలో ఏడుగురు భారతీయులకు చోటు దక్కగా అందులో జెడ్స్కేలర్ జైచౌదరి ఉన్నారు. గత 12 నెలల కాలంలో భారీగా సంపద పెరిగిన వారి జాబితాలో జైచౌదరి కూడా ఉన్నారు. అతని క్లౌడ్ ఆధారిత కంపెనీ షేర్లు 90 శాతం ఎగిశాయి. కంపెనీలో అతని కుటుంబానికి 45 శాతం వాటా ఉంది. నాస్డాక్లో 2018లో లిస్ట్ అయింది. అతని నెట్ వర్త్ 92 శాతం ఎగిసి 6.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ట్రంప్కు కరోనా దెబ్బ
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంపద ఈ ఏడాది కుంగిపోయింది. గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో 310 కోట్ల డాలర్లతో 275వ స్థానంలో ఉన్న ట్రంప్ 77 స్థానాలు దిగజారి ఈసారి 352వ స్థానానికి పడిపోయారు. ఏడాది కాలంలో ట్రంప్ ఆస్తుల విలువ 60 కోట్ల డాలర్లు హరించుకుపోయింది. కరోనా దెబ్బతో ట్రంప్ కుటుంబ నిర్వహణలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయి.