కొత్త పన్ను వేస్తాం: ఆపిల్ చైనా నుండి భారత్ రాకుండా ట్రంప్ బెదిరింపులు!
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సొంత దేశానికి చెంది.. విదేశాలలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వేలాది కంపెనీలు చైనాను వదిలి ఇతర దేశాల వైపు చూస్తోన్న విషయం తెలిసిందే. ఇవి బీజింగ్ నుండి అమెరికాకు మాత్రమే వచ్చేలా ట్రంప్ కుయుక్తులు 'పన్ను'తున్నారు.
చైనాకు ఫస్ట్ ఝలక్: ఇండియాకు ఆపిల్ ప్రొడక్షన్ యూనిట్ల తరలింపు, కేంద్రం ఆ అవరోధాలు తొలగించాకే..
అమెరికాకు రాకుంటే.. కొత్త పన్నులు
మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులకు సంబంధించి చైనా నుండి ఇతర దేశాలకు వెళ్తే కొత్త పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. చైనా నుండి ఇండియా రావాలనుకునే ఆపిల్ వంటి కంపెనీలపై ఈ ప్రభావం పడనుంది. ఆపిల్ 20 శాతం ఉత్పత్తిని భారత్ తరలించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ చైనా నుండి ఇఅమెరికాకు కాకుండా ఇండియా, ఐర్లాండ్.. ఇలా ఏ ఇతర దేశాలకు తరలించినా కొత్త పన్ను ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు.
అమెరికాకు వస్తే ప్రోత్సాహకాలు
ఆపిల్ చైనా నుండి ఇండియా, ఐర్లాండ్కు తరలిందుకు సిద్ధమైంది. ట్రంప్ ఫ్యాక్స్ బిజినెస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియాకు వెళ్తామని ఆపిల్ చెబుతోందని, అదే జరిగితే ఆ సంస్థకు కొత్తగా పన్ను పోటు తప్పదన్నారు. తద్వారా చైనా నుండి భారత్ సహా ఇతర దేశాలకు వెళ్లిపోతున్న అమెరికా సంస్థలకు బ్రేకులు వేస్తున్నారు. అమెరికాకే రావాలని ఆయన ఓ విధంగా బెదిరిస్తున్నారు. అమెరికాకు తరలిస్తే మాత్రం ప్రోత్సాహకాలు ఉంటాయని చెబుతున్నారు.
స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట..
ట్రంప్ మొదటి నుండి స్థానికులకే ఉద్యోగాలు అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సంస్థలు స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని, అమెరికన్ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెబుతున్నారు.
భారత్కు దెబ్బ
చైనా నుంచి తరలి వెళ్లే కంపెనీలను ఆకర్షించేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. భూకేటాయింపు, ప్రోత్సాహకాలు ఇలా అన్నింటిని దాదాపు సిద్ధం చేసింది. కానీ ట్రంప్ హెచ్చరికలు భారత్కు నష్టదాయకంగా చేసేలా ఉన్నాయి. మరోవైపు, తమ దేశం నుండి భారత్ సహా ఇతర దేశాలకు తరలి వెళ్లే కంపెనీలను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. భారత్, నేపాల్, ఇండోనేషియా, వియత్నాం, తైవాన్, మలేషియా తదితర దేశాల సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ దేశాల్లో అలజడులు చెలరేగితే ఉత్పత్తి కేంద్రాలను తరలించకపోవచ్చునని భావిస్తున్నాయేమో అంటున్నారు.