అమెరికాతో ట్రేడ్ వార్, సెమీకండక్టర్స్పై చైనా పన్నులు కట్
సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ రంగంలోని కంపెనీలకు 2030 వరకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. సెమీ కండక్టర్ల పైన అమెరికా ఆంక్షల నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది. సెమీకండక్టర్ల నికర దిగుమతిదారు చైనా. 2020లో అమెరికా నుండి చైనా 350 బిలియన్ డాలర్ల విలువ కలిగిన సెమీకండక్టర్ల దిగుమతులు చేసుకుంది. 2019తో పోలిస్తే ఇది 14.6 శాతం అధికం. ఈ నేపథ్యంలో చైనా సొంతగా సెమీ కండక్టర్లను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
2012 తర్వాత భారీగా నియామకాలు, విదేశాల నుండి ఆర్డర్స్ పెరుగుదల
స్వయంవృద్ధి సాధించడానికి..
అమెరికా ఆంక్షల నేపథ్యంలో అప్రమత్తమైన చైనా నష్టనివారణ చర్యలను చేపట్టింది. ఈ ఏడాది ఆర్థిక లక్ష్యాల్లో సెమీకండక్టర్లలో స్వయంసమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా కావాల్సిన చర్యలను వేగవంతం చేయాలని డ్రాగన్ కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారుచేసే కంపెనీలు, వాటి తయారీకి కావాల్సిన ముడిసరుకు, యంత్ర పరికరాలను ఎలాంటి సుంకం లేకుండానే దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఎంత పరిమాణం దిగుమతి చేసుకుంటే రాయితీ వర్తిస్తుందో ప్రకటించాల్సి ఉంది.
వాణిజ్య సంబంధాలు క్షీణించాక...
చిప్స్, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు చైనా గత రెండు దశాబ్దాల్లో భారీగా ఖర్చు చేసింది. ఆయా సంస్థలు ముడిసరుకు కోసం అమెరికా, ఐరోపా, తైవాన్ పైన ఆధారపడుతున్నాయి. ట్రంప్ హయాంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో హువావే సహా పలు చైనా టెక్ దిగ్గజాలకు సరఫరా నిలిపివేయాలని సెమీ కండక్టర్లు, చిప్స్ తయారీ సంస్థలను ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. జోబిడెన్ అధికారంలోకి వచ్చాక ఈ ఆదేశాలను అలాగే కొనసాగించారు. దీంతో అమెరికా నుండి చైనాకు దిగుమతులు తగ్గాయి.
పడిపోయిన హువావే
దీంతో మొబైల్ టెక్నాలజీలో ప్రపంచంలోనే హువావే అగ్రస్థానంలో ఉంది. వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్న అనంతరం చైనాకు దిగుమతులు నిలిచిపోయి హువావే అయిదో స్థానానికి పడిపోయింది. దీంతో చిప్స్, సెమీ కండక్టర్స్ తయారీ కోసం ఇతరదేశాలపై ఆధారపడకూడదని చైనా నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో స్వయంసమృద్ధి దిశగా ఆలోచన చేస్తోంది. అందుకే సెమీ కండక్టర్స్ అభివృద్ధికి చైనా పన్నులు తగ్గిస్తోంది.