బీదర్వాసుల కోరిక నెరవేర్చిన రామ్ చరణ్ ట్రూజెట్! రూ.699కే బంపరాఫర్.. నాలుగు రోజులే
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉడాన్ పథకంలో భాగంగా హైదారాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూజెట్ సంస్థ తన సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ భాగస్వామిగా ఐదేళ్ల క్రితం ట్రూజెట్ విమానయాన రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే 23 కేంద్రాలకు విమానాలను నడుపుతున్న ట్రూజెట్ ఈ రోజు నుంచి (07-02-2020) ఈశాన్య కర్నాటక ప్రాంతమైన బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. దీంతో బీదర్ నుంచి బెంగళూరుకు ప్రతీరోజూ విమాన ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఇతర మంత్రులు బెంగళూరు విమానాశ్రయంలో ఈ సేసేవలను ప్రారంభించి ట్రూజెట్ విమానంలో బీదర్ వరకు ప్రయాణించారు.
ప్రయాణ భారం తగ్గింది..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్కు కేవలం గంటా నలభై నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం ఉంటుందని, ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. బీదర్ పరిధిలో ఉన్న కళ్యాణ కర్నాటక అభివృద్ధికి ట్రూజెట్ విమాన సర్వీసులు మరింత దోహదపడతాయని యెడ్డీ ఆకాంక్షించారు.
65 శాతానికి పైగా అనుసంధానం
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీస్ సంస్థ ట్రుజెట్ క్రమంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు తక్కువ కాలంలో విస్తరించింది. ఉడాన్ పథకంతో సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించాలనే ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలో భాగంగా ట్రూజెట్ సంస్థ 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుంధానమైంది. ఆర్సీఎస్-1,2,3 కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్ మాత్రమే.
2015లో ప్రారంభమైన ప్రయాణం
బెంగళూరు-బీదర్-బెంగళూరు మధ్య కొత్త సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆ సంస్థ డైరెక్టర్ కెవి ప్రదీప్ మాట్లాడారు. 2015లో తమ ప్రయాణం మొదలు పెట్టామని, నాటి నుంచి దేశంలో ప్రథమశ్రేణి నగరాల నుంచి అభివృద్ధిని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించాలన్న ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామన్నారు.
పర్యాటక, వ్యాపార అభివృద్ధికి దోహదం
ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యాటక, వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నామని, చిన్న చిన్న పట్టణాల అనుసంధానంతో ఉపాధి కల్పనతో పాటు సామాజిక ఆర్థిక ప్రగతి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. ఈ ప్రగతిలో తాము కూడా భాగస్వామిగా మారినందుకు ఆనందంగా ఉందన్నారు.
24 స్టేషన్లకు విస్తరణ
టర్నో మేఘా ఎయిర్వేస్ లిమిటెడ్ సంస్థ సీఈవో, రిటైర్డ్ కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రాంతీయ విమాన సర్వీసుల్లో ట్రూజెట్ బలమైన శక్తిగా ఎదుగుతోందని, అతి తక్కువ కాలంలో తమ సేవల్ని 24 స్టేషన్లకు విస్తరించామని, ఆర్సీఎస్-1,2,3 కింద తమ నిబద్ధతను చాటుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సేవలను మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ప్రాంతీయ విమాన సేవలో ట్రూజెట్ సంస్థ మరింత బలమైన శక్తిగా ఎదిగేందుకు అభివృద్ధి వ్యూహాన్ని రూపొందిస్తున్నామన్నారు.
నాలుగు రోజులు రూ.699 ఆఫర్
బెంగళూరు-బీదర్-బెంగళూరు సర్వీసును ప్రారంభించిన సందర్భంగా ప్రయాణికులకు ట్రూజెట్ సంస్థ నాలుగు రోజుల పాటు బంపరాఫర్ ప్రకటించింది. రూ. 699/-కే బెస్ టికెట్ను అందిస్తోంది. ట్రూజెట్ నెట్ వర్క్కు బీదర్ 24వ స్టేషన్.