30 లక్షలమందికి పేదరికం నుంచి విముక్తి, మోడీ ప్రపంచ సేవకుడు: ట్రంప్
హ్యూస్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని టెక్సాస్ నగరం హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన హౌడీ మోడీ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ 25 నిమిషాలు మాట్లాడారు. మోడీ వేదిక వద్దకు రాగానే మోడీ... మోడీ అంటూ స్టేడియం నినాదాలతో దద్దరిల్లింది. అనంతరం ట్రంప్ వచ్చి ప్రసంగించారు. భారత్, అమెరికా కలలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీతో కలిసి పని చేస్తామని చెప్పారు.
హోడీ మోడీ: 'అమెరికాకు భారత్ అత్యంత నమ్మకమైన స్నేహితుడు'
మోడీ ప్రపంచ సేవకుడు
నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు అని, ప్రపంచ సేవకుడు అని ట్రంప్ కొనియాడారు. భారత్తో పాటు ప్రపంచమంతటికీ మోడీ గొప్ప సేవ చేస్తున్నారని కితాబిచ్చారు. భారత అత్యున్నత విలువలు, సంస్కృతి అమెరికా విలువలతో కలిసిపోతాయన్నారు. ఇరుదేశాల మధ్య గతంలో లేనంతగా సంబంధాలు బలోపేతమయ్యాయని చెప్పారు. ప్రపంచానికి మనం మార్గనిర్దేశనం చేస్తున్నామని, అమెరికాలో ఆర్థిక సమానతలు వేకంగా తగ్గుతున్నాయన్నారు.
అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు
నాలుగేళ్లలో తాము 1.40 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించామని ట్రంప్ చెప్పారు. పన్నుల హేతుబద్దీకరణతో కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు చెప్పారు. ఓహియోలో భారత కంపెనీ జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగారం నిర్మిస్తోందని, ఎప్పుడూ లేనంతగా అమెరికాలో భారత్కు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇక్కడ తయారైన అత్యుత్తమ వస్తువులు భారతీయులకు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే అమెరికా కూడా భారత్లో పెట్టుబడులు పెడుతోందన్నారు.
టెక్సాస్ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులు
టెక్సాస్ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులు భారత్కు అందుతాయని ట్రంప్ హామీ ఇచ్చారు. భారత సంతతి అమెరికన్లు అమెరికా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో వారు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అమెరికాలో నిరుద్యోగం 51 ఏళ్ల కనిష్టానికి చేరుకుందని, గత రెండేళ్లలో భారతీయ అమెరికన్లలో నిరుద్యోగం 1/3 శాతం తగ్గిందని తెలిపారు.
మోడీ ఆర్థిక సంస్కరణలపై ప్రశంసలు
మోడీ ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణలతో 30 లక్షల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించిందని ట్రంప్ ప్రశంసించారు. 40 కోట్ల మంది బలమైన మధ్య తరగతి భారత్కు ఉన్న ఆస్తి అని చెప్పారు. మోడీ గొప్ప నాయకుడు, తన స్నేహితుడు అన్నారు. ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తిలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, అమెరికా నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కొనుగోలుకు భారత కంపెనీ ముందుకు వచ్చిన వార్త తనను థ్రిల్కు గురి చేసిందన్నారు.
ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి భారత్కు రక్షణ కల్పిస్తాం
భారత్, అమెరికా రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయని, సరిహద్దు భద్రత అనేది ఇరుదేశాలకు చాలా ప్రాధాన్యం కలిగిన అంశమని ట్రంప్ చెప్పారు. సరిహద్దు భద్రతలో భారత్కు సహకరిస్తామన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా త్వరలో పలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. కాగా, హ్యోస్టన్ నుంచి హైదరాబాద్ దాకా, బోస్టన్ నుంచి బెంగళూరు దాకా, చికాగో నుంచి సిమ్లా వరకు మనం ఒక్కటయ్యామని అభిప్రాయపడ్డారు.
ఆలస్యంగా వచ్చిన ట్రంప్.. ఎందుకంటే
హౌడీ మోడీ కార్యక్రమానికి ట్రంప్ గంట ఆలస్యంగా వచ్చారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.39గంటలకు ట్రంప్ ప్రసంగం ప్రారంభం కావాలి. కానీ గం.10.25లకు ట్రంప్ సభకు వచ్చారు. ఇందుకు హ్యోస్టన్లో గత కొన్నాళ్లుగా కురుస్తున్న వర్షాలే కారణం. సభ జరుగుతున్న ఎన్ఆర్జీ స్టేడియానికి చేరుకోవడానికి ట్రంప్ సిద్ధమైన సమయంలో ఎల్లింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఆగవలసి వచ్చింది. వరద పరిస్థితులకు సంబంధించిన వివరాలు రావడంతో ఆయన వాటిని సమీక్షించారు. వరదల కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆలస్యమైంది.
మోడీ హౌడీ కార్యక్రమంలో తొలిసారి భారత్-అమెరికా ఫ్లాగ్
భారత్-అమెరికా స్నేహానికి వేదికగా నిలిచిన హౌడీ మోడీ కార్యక్రమం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. అమెరికా అధ్యక్షులు ప్రసంగించే పోడియం ఉండే అమెరికా అధ్యక్షుడి ముద్ర స్థానంలో భారత్-అమెరికా పతాకాలతో కూడిన చిహ్నాన్ని ఉంచారు. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా ఇలా అన్ని రకాల సభల్లో అమెరికా అధ్యక్షుడు ప్రసంగించే పోడియం మీద అమెరికా అధ్యక్షుడి ముద్రను పెట్టడం ఆనవాయితీ. కానీ మోడీ హౌడీ కార్యక్రమంలో ఆ కొత్త సంప్రదాయానికి తెరలేపారు.
NBA బాస్కెట్ బాల్ గేమ్కు వస్తా...
NBA బాస్కెట్ బాల్ గేమ్ను భారత్కు పరిచయం చేయనున్నామని, వచ్చే నెలలో ముంబైలో ఎన్బీఏ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుందని ట్రంప్ తెలిపారు. మోడీ ఆహ్వానిస్తే భారత్కు వస్తానన్నారు. 'ప్రధాని గారూ.. నన్ను ఆహ్వానిస్తారా? నేనొస్తా కావొచ్చు.. జాగ్రత్త.. నేను వచ్చే అవకాశం ఉంది' అన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగాన్ని ముగిస్తూ భారత్కు రావాలని ట్రంప్ను ప్రధాని మోడీ ఆహ్వానించారు.
కిందపడిన పూవును తీసిన మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. శనివారం రాత్రి హ్యూస్టన్లోని జార్జిబుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోడీకి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వారు ఇచ్చిన పుష్పగుచ్ఛం నుంచి ఓ పువ్వు జారి కింద పడింది. ప్రధాని మోడీ వెంటనే కిందకు వంగి దానిని తీసుకున్నారు. ప్రధానే స్వయంగా ఇలా చేయడం చూసి, అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. దీంతో మోడీ అక్కడి వారి హృదయాలే కాదు నెటిజన్ల హృదయాలు కూడా గెలిచారు.
మోడీకి ట్రంప్ మద్దతు.. స్టాండింగ్ ఒవేషన్
హోడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతుగా సభకు హాజరైనవారంతా ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు సభకు హాజరైన ప్రవాస భారతీయులంతా నిలబడి ట్రంప్కు మద్దతుగా చప్పట్లు కొట్టారు. భారత్ను అస్థిరపరిచేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోడీ పాక్ పైన విరుచుకు పడ్డారు. అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులు, ముంబైపై జరిగిన నవంబర్ 26 దాడులకు సూత్రధారులు పొరుగుదేశంలో ఉన్నారన్నారు.