వీడని ఆర్థిక మాంద్యం ముప్పు! భారత్ తట్టుకుంటుందా?
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందని, ఆ ప్రభావం భారత్పైనా పడుతుందనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. దీనికితోడు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది మరింత తగ్గుతుందని, దశాబ్దంలోనే కనిష్ఠానికి చేరుకుంటుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సైతం ఇటీవల వెల్లడించింది. ఇదిలా ఉండగా.. సౌదీలో తాజాగా చమురు క్షేత్రాలపై దాడులు జరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు తప్పదని అంటున్నారు.
అదేగనుక జరిగితే.. ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడక మానదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే.. గత రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి, జీడీపీ వృద్ధి రేటు తగ్గడం భయపెడుతోంది. దీనికితోడు దేశీయంగా కొనుగోళ్లు పడిపోవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. చమురు ధరలు పెరగడం, మరోవైపు స్టాక్ మార్కెట్లు నీరసించడం, ఇవన్నీ చూస్తుంటే.. మనదేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా గాడి తప్పుతుందేమో, ఆర్థిక మాంద్యం తప్పదేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక మాంద్యమా? వృద్ధి రేటు మాంద్యమా?
అయితే ఇది ఆర్థిక మాంద్యం కాదని, వృద్ధి రేటు మాంద్యం అని కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ తేడా ఉంది. దేశ జీడీపీ వృద్ధి వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గితే అది ఆర్థిక మాంద్యం. అలాకాకుండా వరుస త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తుంటే దానిని గ్రోత్ రెసిషన్.. అంటే వృద్ధి రేటు మాంద్యం అంటారు. ప్రస్తుతం భారత్లో ఉన్నది వృద్ధి రేటు మాద్యం అని కొంతమంది ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.
జీడీపీ వృద్ధి ఎందుకు తగ్గిందంటే...
ఈ ఏడాది మొదటి, రెండో త్రైమాసికంలో జీడీపీ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా చైనాకు మన దేశం నుంచి ఎగుమతులతోపాటు అక్కడ్నించి మనదేశానికి దిగుమతులు కూడా పడిపోయాయి. దీనికితోడు అమెరికా మన దేశానికి జీఎస్పీ ఎత్తివేసింది. మరోవైపు 2011 నుంచి భారత్లో పెట్టుబడుల వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. ఏ దేశంలో అయినా పెట్టుబడులే కొత్త ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ పెట్టుబడులు లేకపోవడంతో నిరుద్యోగం పెరిగింది. జీఎస్టీ వసూళ్లు కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం కూడా వ్యయం తగ్గించుకుంది. ఇవన్నీ దేశ జీడీపీపై ప్రభావం చూపించాయి.
వృద్ధి రేటు మాంద్యం కూడా ప్రమాదమే...
జీడీపీ వృద్ధి రేటు మందగించడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరో మాటలో చెప్పాలంటే.. ఇదొక విష వలయమే. ఇందులో గనుక చిక్కుకుంటే దేశ ఆర్థిక పరిస్థితులు నానాటికీ క్షీణిస్తాయి.
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్లో నిరాశాజనక పనితీరును కనబరిచింది. ఫలితంగా దేశ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. జీడీపీ వృద్ధి రేటు కూడా 5 శాతానికి పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడించాయి. నోట్ల రద్దు జరిగినప్పట్నించే భారత ఆర్థిక వ్యవస్థను ఈ సమస్యలు పీడిస్తున్నాయనే వాదనలూ లేకపోలేదు.
వృద్ధి రేటు తగ్గడానికి కారణాలేమిటి?
జీడీపీ వృద్ధి రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణత, తయారీ రంగం నెమ్మదించడం, దేశీయ డిమాండ్ పడిపోవడం. సాధారణంగా మన దేశం ఈ దేశీయ డిమాండ్పైనే ఆధారపడి వృద్ధి సాధిస్తూ ఉంటుంది. అంటే మన దేశం ఎగుమతుల విలువ దాదాపు 500 బిలియన్ డాలర్లు మాత్రమే. మిగిలినదంతా దేశీయ మార్కెట్ డిమాండే. 2008లో ఒకసారి మన దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ.. ఈ దేశీయ డిమాండ్ కారణంగానే ఆ పరిస్థితిని తట్టుకుని నిలబడగలిగింది. అయితే ఈసారి ఈ దేశీయ డిమాండ్ పడిపోయింది. ఇదే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
దేశీయ డిమాండ్ ఎందుకు తగ్గింది?
వివిధ వర్గాల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో దేశీయంగా డిమాండ్ తగ్గింది. కొనుగోళ్లు తగ్గడానికి కారణం.. సామాన్యుడు ఖర్చులు తగ్గించుకోవడం, దానికి తోడు నిరుద్యోగం రేటు బాగా పెరిగిపోవడం. మన దేశంలో గత ఏడాది వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా లేదు. దీంతో ఆహార ధాన్యాల దిగుబడి కూడా తగ్గింది. ఫలితంగా రైతంగం తమ ఖర్చులు తగ్గించుకుంది. ఇది దేశీయ డిమాండ్పై ప్రభావం చూపింది. అలాగే దేశంలో నిరుద్యోగం రేటు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చేరింది. ఉద్యోగాలే లేకపోతే డబ్బు ఎక్కడ్నించి వస్తుంది? ఎలా ఖర్చు చేస్తారు.
ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే...
జీఎస్టీ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. స్లాబ్ రేట్లను తగ్గించాలి. ఎక్కువ మంది పన్ను చెల్లించేలా ప్రోత్సహించాలి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ మంజూరు విధివిధానాల్లో కూడా మార్పులు తీసుకురావాలి. పారిశ్రామిక రంగానికి, వినియోగదారులకు రుణ సదుపాయాలను మెరుగుపరచాలి. ఇవి పెట్టుబడులను పెంచడంతోపాటు కొత్త ఉద్యోగాలు కూడా సృష్టిస్తాయి. అలాగే ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు అవసరమైన మినహాయింపులు ఇవ్వాలి. వ్యవసాయ రంగం వృద్ధికి కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఫలితంగా సామాన్యుడి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్బీఐ నుంచి మిగులు నిధులు తీసుకోవడంతో మళ్లీ ప్రభుత్వ వ్యయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకునే అవకాశం ఉంది.
భయపడాల్సిన అవసరం లేదు: శక్తికాంత దాస్
భారత ఆర్థిక వ్యవస్థ మరీ అంత ఆందోళనకరంగా ఏమీ లేదని, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ముంబైలో గురువారం జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందనే విషయంపైనా ఆయన స్పందించారు. అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ఉండదన్నారు. ఎందుకంటే మన దేశ జీడీపీలో విదేశీ రుణాలు 19.7 శాతం మాత్రమే ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే కొన్ని సంస్కరణలు అవసరమని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు.