ఆసక్తికరం: గల్ఫ్లో చమురు సంక్షోభానికి.. అసలు కారణాలేమిటో తెలుసా?
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అత్యధికంగా ప్రభావితం చేసే అంశాలలో చమురు ధరలు ఒకటి. చమురు ధరలు పెరిగినప్పుడల్లా వాటి ప్రభావం ఆయా దేశాల మార్కెట్లపై కూడా పడుతుంది. ఫలితంగా ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. అంతేకాదు, ఈ చమురు ధరలు ప్రపంచ దేశాల రాజకీయాలను కూడా శాసిస్తాయి. అయితే అసలు ఈ చమురు ధరలు ఎందుకు పెరుగుతాయి?
ఇది తెలియాలంటే.. అసలు చమురు ఏయే దేశాల్లో ఉత్పత్తి అవుతుందో మొదట తెలుసుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా, రష్యా, సౌదీ అరేబియా అగ్రభాగాన నిలుస్తాయి. ఒకప్పుడు ఆగ్రరాజ్యాలంటే అమెరికా, రష్యాలే. వీటి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉండేది. ఈ రెండు దేశాల నడుమ ఆధిపత్య పోరు ఉండేది.
అమెరికా, రష్యా ఆధిపత్య పోరులో...
అయితే కాలక్రమంలో రష్యా ఆర్థికంగా దెబ్బతింది. దీనికి కారణం కూడా అమెరికాయే. రష్యా కొంత బలహీనపడిందేకానీ.. ఆధిపత్య పోరు నుంచి వెనక్కి మాత్రం తగ్గదు. ఈ రెండు దేశాల నడుమ ఈ ఆధిపత్య పోరు నేటికీ చాప కింద నీరులా కొనసాగుతూనే ఉంది. అమెరికాను నేరుగా ఎదుర్కోలేక.. పగ తీర్చుకునేందుకు ఇతర మార్గాల ద్వారా.. రష్యా ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకు అది గల్ఫ్లో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటోంది.
చమురు ధరలు పెరిగితే రష్యాకు లాభం...
రష్యాకు చమురు, ఆయుధ వ్యాపారమే ప్రధానమైనవి. రష్యా జీడీపీలో 60 శాత కేవలం చమురు ఎగుమతి ద్వారానే లభిస్తుందంటే.. చమురు వ్యాపారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చమురు ధరలు ఎంత పెరిగితే రష్యాకు అంత లాభం. అందుకే ఒక్కోసారి చమురు ధరలు పెరిగే పరిస్థితులను సృష్టించడానికి కూడా రష్యా వెనకాడదు. ఇందుకు అది తన మిత్రదేశమైన ఇరాన్ను వాడుకుంటోంది.
అమెరికా ఏం చేస్తుందంటే...
అమెరికా ఆర్థిక వ్యవస్థ కేవలం చమురుపైనే ఆధారపడి లేదు. దానికి పలు రకాల వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కానీ తన శత్రుదేశమైన రష్యాను ఆర్థికంగా అణగదొక్కాలంటే అమెరికాకు ఈ చమురు ప్రధాన ఆయుధం. అందుకే చమురు ధరలు పెరగకుండా సౌదీ అరేబియాను అడ్డం పెట్టుకుని ‘ఒపెక్' (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) ను ప్రభావితం చేస్తుంటుంది.
ఇరాన్తో రష్యాకు స్నేహమెందుకు?
2014 తరువాత నుంచి చమురు ధరలు బాగా తగ్గడంతో రష్యా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతింది. ఈ క్రమంలో ‘తన శత్రువుకి శత్రువు తనకు మిత్రుడే' అనే రీతిలో అది అమెరికా శత్రువైన ఇరాన్తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంది. దీనికి మరో కారణం కూడా ఉంది. సౌదీ అరేబియాకు సంబంధించిన చమురు హర్మూజ్ జలసంధి ద్వారానే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ జలసంధిపై ఇరాన్కు మంచి పట్టుంది. దీంతో ఇరాన్కు అవసరమయ్యే ఆయుధాలు, సాంకేతికతను అందజేస్తూ.. గల్ఫ్లో ఉద్రిక్తతలు, సంక్షోభానికి రష్యా పరోక్షంగా ప్రయత్నిస్తుంది.
తాజా సంక్షోభం ఇదీ...
ఇటీవల ముడి చమురు ధరలు 10 శాతం పెరిగాయి. దీనికి కారణం గల్ఫ్లో తాజా సంక్షోభమే. ఈ సంక్షోభానికి కారణం.. సౌదీ అరేబియా ప్రధాన చమురు ఉత్పత్తి సంస్థ అయిన ఆరాంకోకు చెందిన అబ్కాయిక్, ఖురైస్లోని చమురు క్షేత్రాలపై ఈ నెల 14న డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడి జరగడమే. దీనికోసం 18 యూఏవీలు, 7 క్రూయిజ్ మిస్సైళ్లు ఉపయోగించారని, ఈ దాడి ఇరాన్ భూభాగం నుంచే జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దాడులకు కారణం.. ఇరాన్!?
సౌదీలోని చమురు క్షేత్రాలపై జరిగిన ఈ దాడులకు కారణం ఉత్తరం వైపు ఉన్న ఇరాన్ అనే ఆరోపణలు వినరావడంతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిజమే అయిన పక్షంలో ఇరాన్పై తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరించారు. ఇందుకు ప్రతిగా ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ.. తమ జోలికొస్తే అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు సైతం వెనకాడమంటూ హెచ్చరిక చేశారు.
దీంతో మరోసారి ప్రపంచ దేశాలను యుద్ధ భయాలు కమ్ముకున్నాయి.
దాడికి కారణాలేమిటంటే...
యెమన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. అక్కడి ప్రభుత్వంపై హౌతీ రెబల్స్ పోరాటం జరుపుతున్నారు. అయితే ఈ హౌతీ రెబల్స్ను అణిచివేసేందుకు సౌదీ అరేబియా రంగంలోకి దిగింది. దీనికి అమెరికా తదితర దేశాల సహాయం కూడా ఉంది. యెమెన్లోని హౌతీ రెబల్స్ను వాయుసేన దాడులతో తేలికగా అణగదొక్కవచ్చనే అంచనాలతో 2015లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వారిపై ప్రత్యక్ష దాడులకు సైన్యాన్ని దించారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువు కాదు. హౌతీ రెబల్స్ ఈ దాడులను తిప్పికొడుతూ సౌదీకి చుక్కలు చూపిస్తున్నారు.
సౌదీకి బుద్ధి చెప్పేందుకేనా?
తమ పోరాటంలో సౌదీ అనవసరంగా జోక్యం చేసుకుందన్న కోపం హౌతీ రెబల్స్ మదిలో మెదులుతూనే ఉంది. దీంతో సౌదీకి బుద్ధి చెప్పడం కోసం హౌతీ రెబల్స్ డ్రోన్లు, క్షిపణుల ద్వారా సౌదీలోని చమురు క్షేత్రాలపై దాడులకు పాల్పడ్డారు. గతంలో కూడా వీరు సౌదీ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. కానీ అప్పట్లో పెద్దగా నష్టం వాటిల్లలేదు. తాజా దాడులతో సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఫలితంగా ప్రపంచ చమురు ఉత్పత్తిలో 5 శాతం ప్రభావితమైంది.
హౌతీ రెబల్స్కు ఈ డ్రోన్లు ఎక్కడివి?
అయితే సౌదీలోని చమురు క్షేత్రాలపై ప్రయోగించిన డ్రోన్లు హౌతీ రెబల్స్కు ఎక్కడ్నించి వచ్చాయి? ఎవరు వాటిని వారికి అందజేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి 2002లో అల్ఖైదా ఉగ్రవాద శిబిరాలపై అమెరికా జరిపిన డ్రోన్ దాడుల తరువాత నుంచి వీటి వినియోగం బాగా పెరిగింది. హౌతీ రెబల్స్ ఉపయోగించిన క్వాతీఫ్-1 డ్రోన్లు వీరికి ఎలా అందుతున్నాయన్నది ఒక ప్రశ్నగా మారింది.
ఇరాన్ ప్రమేయం ఉందా?
ఇక్కడే ప్రపంచ దేశాలకు ఇరాన్పై అనుమానం కలుగుతోంది. ఎందుకంటే యెమెన్ హౌతీ రెబల్స్ సౌదీ చమురు క్షేత్రాలపై ప్రయోగించిన డ్రోన్లు ఇరాన్కు చెందిన అబాబిల్-1 డ్రోన్లను పోలి ఉన్నాయి. వీటిని ది ఇరాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ తయారు చేస్తోంది. వీటి విడి భాగాలను యెమెన్కు తరలించి, అక్కడ వాటిని అసెంబ్లింగ్ చేసి దాడులకు పాల్పడి ఉంటారని అంచచనా వేస్తున్నారు. అంతేకాక ఇటీవల సౌదీ సంకీర్ణ దళాలు హౌతీ రెబల్స్కు చెందిన డ్రోన్ బోట్ ఒకదానిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇరాన్లో తయారైన విడిభాగాలు ఉన్నాయి. మరోవైపు అమెరికా శాటిలైట్లు తీసిన చిత్రాలు కూడా సౌదీలోని చమురు క్షేత్రాలపై ఉత్తర దిశ నుంచే దాడులు జరిగినట్లు చెబుతున్నాయి. ఉత్తర దిశ నుంచి దాడులు జరపాలంటే కచ్చితంగా ఇరాన్ లేదా ఇరాక్ భూభాగాన్నే వాడుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకున్నా.. ఈ దాడుల్లో ఇరాన్ ప్రమేయం కనిపిస్తోందనేది అమెరికా వాదన. కానీ ఇరాన్ మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు.