గెలుపులో మీ పాత్ర, రెడ్ కార్పెట్: అమెరికాలో జగన్ కీలక వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అమెరికా పర్యటనలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పెట్టుబడులతో రావాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమ విధానాలు విప్లవాత్మకం అని, పెట్టుబడులతో వస్తే అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంద్రులను కోరారు. పెట్టుబడులు పెట్టే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్సైట్ లో సమాచారం ఇస్తే ప్రభుత్వం అన్ని రకాల అనుమతులను మంజూరు చేస్తుందన్నారు.
మీరు హౌస్పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చు
మూడు నెలల్లో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లోని హచిన్ సన్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రవాసా:ధ్రులతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వివక్షలేని పాలన అందించాలనేది తన కల అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మూడు నెలల్లో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా చెప్పారు.
రిజర్వేషన్లు కల్పిస్తున్నాం
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడ 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. మార్పు అనేది నాయకత్వం నుండి రావాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు తెలుగువారిని పొగడడం తనకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతికి దూరంగా పాలన సాగిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించడమే తన స్వప్నమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఆయన వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాల గురించి జగన్ సమావేశంలో ప్రస్తావించారు.
వైసీపీ గెలుపులో అమెరికా తెలుగు కమ్యూనిటీ...
ఏపీ ఎన్నికల్లో అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ గొప్ప పాత్ర పోషించిందని, వారు పోషించిన పాత్ర ఎంత గొప్పదో తనకు తెలుసునని జగన్ అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లు, 25 లోకసభ స్థానాలకు గాను 22 సీట్లు గెలిచామంటే ఇక్కడి (ప్రవాసాంధ్రులు) వారు చేసిన కృషి కూడా ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తాము రెడ్ కార్పెట్ వేస్తున్నట్లు తెలిపారు.
భారతితో కలిసి హాజరు...
వాషింగ్టన్ ఇండియా హౌస్లో అమెరికాలోని భారత రాయబారి హర్ధవర్ధన్ ఇచ్చిన విందుకు జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. ఏపీలో అవినీతిరహిత పాలన అందించడం, ప్రభుత్వ కొనుగోళ్లు, కాంట్రాక్టులలో పారదర్శకత నెలకొల్పడం తమ ప్రాథామ్యాలన్నారు. పెట్టుబడులతో వచ్చేవారికి అనుమతులు అన్నింటిని ఒకేచోట లభించే ఏర్పాట్లు చేశామన్నారు. కంపెనీలు, ప్రాజెక్టులు నెలకొల్పే వారికి ప్రతి దశలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నవ్యాంధ్రలో నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయని, వివిధ ప్రాంతాలతో రాష్ట్రానికి రవాణా అనుసంధానంతో పాటు మంచి మౌలిక వసతులున్నాయని జగన్ చెప్పారు.
ఔషధ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన జగన్
ఏపీలో ఔషధ రంగంలో పెట్టుబడులు పెట్టాలని జగన్... ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ సైన్సెస్ సీనియర్ డైరెక్టర్ను కోరారు. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో పార్ట్నర్షిప్కు ముందుకు రావాలన్నారు. ఏపీలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, స్మార్ట్ సిటీలు, లైటింగ్ ఉత్పత్తులతో సహా పలు రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు ఇండస్ట్రియలిస్ట్లు సంసిద్ధత వ్యక్తం చేశారు.