చైనాతో ట్రేడ్ వార్: అమెరికన్లపై 12.2 బిలియన్ డాలర్ల భారం
వాషింగ్టన్: అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్ ప్రభుత్వంతో ట్రేడ్ వార్ నేపథ్యంలో అగ్రదేశం ఎంత దాకా వెళ్తే బీజింగ్ కూడా అంత దూరం వెళ్లేందుకు సిద్ధంగా ఉందని, ఎక్కడా తగ్గే సమస్య లేదని చైనా స్టేట్ రన్ మీడియా పేర్కొంది. వాణిజ్యంపై చర్చలు జరగాలంటే చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వాషింగ్టన్ టారిఫ్ తగ్గించాల్సిందేనని ఆ పత్రిక పేర్కొంది. చర్చలు ఇరువైపులా లాభం కలిగేలా ఉండాలని పేర్కొంది.
ఏం చెల్లించారో చెప్పండి: గూగుల్కు ఇండియా షాక్! స్మార్ట్ఫోన్ మేకర్స్కు CCI లేఖలు
ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్ అమెరికాకే భారంగా మారిందని చెబుతున్నారు. చైనాకు నుంచి దిగుమతి అయ్యే 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్ విధించింది. దీంతో అమెరికా వినియోగదారులు అదనంగా 12.2 బిలియన్ డాలర్లను వెచ్చించవలసి వస్తోంది. ముఖ్యంగా దుస్తులు, ఫుట్వేర్, గృహోపకరణలపై ఈ భారం పడుతోందట.
టారిఫ్స్ వల్ల దుస్తులపై 4.4 బిలియన్ డాలర్లు, ఫుట్వేర్పై 2.5 బిలియన్ డాలర్లు, బొమ్మలపై 3.7 బిలియన్ డాలర్లు, గృహోపకరణాలపై 1.6 బిలియన్ డాలర్లు అదనంగా చెల్లించవలసి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మార్కెట్లు ఈ వ్యాపారాలకు అనుకూలంగా ఉండవని, దిగుమతుల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని, కొద్ది రోజులు చైనా సరఫరాదారులనే కొనసాగించి ఆ భారం వినియోగదారులపై మోపుతారని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఫ్యాషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రకారం టారిఫ్ కారణంగా వినియోగదారులపై 4.9 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోంది.
వాషింగ్టన్ - బీజింగ్ ట్రేడ్ వార్ పైన చైనాలోని కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. మేడిన్ చైనా యుగం ముగిసిందని... ప్రపంచంలోనే అత్యధికంగా సైకిళ్లను తయారు చేసే జెయింట్ మ్యానిఫ్యాక్చరింగ్ కో చైర్మన్ బోన్నీటు ఇటీవల అన్నారు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ అన్నారో.. అప్పటి నుంచే తాము సీరియస్గా దృష్టి సారించామని చెప్పారు. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికాకు చెందిన తమ ఆర్డర్ల కోసం తమ ప్రొడక్షన్ను తైవాన్కు మార్చాలని నిర్ణయించింది.
తాము అధిక టారిఫ్లు విధిస్తామని ట్రంప్ గత సెప్టెంబర్లో చెప్పినప్పటి నుంచే ఈ సైకిళ్ల తయారీ కంపెనీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ట్రంప్ నోరు మూయకముందే తాము వెళ్లేందుకు సిద్ధమయ్యామన్నారు. తద్వారా ట్రంప్ తమపై టారిఫ్ విధించకముందే వెళ్తున్నట్లుగా చెప్పారు. ట్రంప్ టారిఫ్ దెబ్బకు చైనా నుంచి పలు కంపెనీలు వలస పోతున్నాయి. కొన్ని కంపెనీలు అమెరికాకు, మరికొన్ని ఇతర దేశాలకు వెళ్తున్నాయి.