హువావేపై అమెరికా బుట్టలో పడకండి: ఇండియాకు చైనా విజ్ఞప్తి
బీజింగ్: హువావేపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హువావేపై ట్రంప్ ప్రభుత్వం చర్యల నేపథ్యంలో గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు కూడా షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో హువావే ఇబ్బందులు పడుతోంది. దీంతో హువావే టెలికం కంపెనీని అమెరికా దృష్టికోణంతో చూడవద్దని చైనా... భారత్కు విజ్ఞప్తి చేసింది. అమెరికా ప్రభావానికి లోనుకాకుండా, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.
100 రోజుల్లో 5G ట్రయల్స్, స్పెక్ట్రంలో చైనా హువావైపై నో డిసిషన్!
5G వేలంపై హువావే ఆసక్తి
ఇటీవల కేంద్ర టెలికం మినిస్టర్ రవిశంకర ప్రసాద్ 5G ట్రయల్స్ వేలంలో హువావే పాల్గొనే అంశంపై స్పందిస్తూ సెక్యూరిటీ కారణాల అంశాన్ని లేవనెత్తారు. 5G ట్రయల్స్లో హువావే పాల్గొంటుందా అని మీడియా ప్రశ్నించగా, అది చాలా పెద్ద అంశమని, భద్రతా కారణాలు తదితర కోణాల్లో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు అయితే హువావేపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 'మేము దీనిపై స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అక్కడ భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి. ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈ నేపథ్యంలో ఒక కంపెనీ దీనిలో పాల్గొనాలని చెప్పడం కష్టమైపోతుంద'న్నారు.
చైనా స్పందన
భారత్లో త్వరలో 5G స్పెక్ట్రం వేలం వేయనున్నారు. హువావే ఈ వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. హువావేను అనుమతించాలా.. వద్దా.. అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తాజాగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ ఓ ప్రకటన చేశారు.
పరస్పర ప్రయోజనాల కోసం విజ్ఞప్తి
చైనా కంపెనీలు ఏ దేశంలో సేవలు అందించినా ఆయా దేశాల చట్టాల్ని, నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని తాము చెబుతామని, ఏదైనా దేశం వారి చట్టం ప్రకారం ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని, భద్రతను ఒక సాకుగా వాడుకోవడాన్ని కూడా చైనా వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే చాలా దేశాలు హువావే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి 5Gలో భాగస్వామిగా చేర్చుకున్నాయన్నారు. భారత్ కూడా అంతే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నామన్నారు. ఓ వైపు విజ్ఞప్తి చేస్తూనే, అల్టిమేటం జారీ చేసిన విధంగా ఆయన మాట్లాడారు. చైనా - ఇండియా పరస్పర వ్యాపార ప్రయోజనాల కోసం నిష్పక్షపాత, వివక్షలేని విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.