నైపుణ్యానికే ప్రాధాన్యం.. గ్రీన్కార్డు జారీపై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఇండియన్ ఐటీ నిపుణులకు శుభవార్త అందనుంది. ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వేలాది మందికి రిలీఫ్ దొరకనుంది. గ్రీన్ కార్డుల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం వెలువరించనుంది. ఈ మేరకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లాటరీ విధానంలో గ్రీన్ కార్డులు కేటాయిస్తుండగా... కొత్త విధానంలో నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఇవ్వనున్నారు.
ట్రంప్ సంచలన నిర్ణయం, అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ: చైనీస్ హువావేపై నేరుగా యుద్ధం
గ్రీన్ కార్డుల జారీలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న వారి కుటుంబీకులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం నిపుణల ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ గురువారం వైట్ హౌస్లోని రోజ్ గార్డెన్లో కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రెసిడెంట్ ఆఫీస్ వెల్లడించింది.
కొత్త విధానం వెనుక ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కృషి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అమలైతే.. అమెరికా టెక్నికల్ నీడ్స్ తీర్చేవారికే గ్రీన్ కార్డుల జారీలో ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12శాతం గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో 100శాతం గ్రీన్ కార్డులు నైపుణ్యం ఆధారంగా కేటాయించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే హెచ్ 1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులకు త్వరగా గ్రీన్ కార్డులు లభించే అవకాశం ఉంది.