భారత్పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్!: చైనా దారిలోనే ఇండియా, ఇరాన్ వైపే.. ధరలెలా ఉంటాయో?
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను మే 2వ తేదీలోపు నిలిపి వేయాలని భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు సోమవారం అమెరికా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలు పాటించకుంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఓ వైపు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా వార్నింగ్ ఇచ్చినప్పటికీ భారత్, చైనాలు మాత్రం ఇరాన్ నుంచి పూర్తిగా చమురు దిగుమతులు నిలిపేసేందుకు సిద్ధంగాలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ చమురు ఎగుమతులు సున్నాకు తెచ్చేందుకు ఆరు నెలల క్రితమే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. 8 దేశాలకు మాత్రం ఆరు నెలల గడువు ఇచ్చింది. త్వరలో ఆ గడువు ముగియనుంది. దీంతో భారత్, చైనా సహా ఏ దేశానికి మినహాయింపు లేదని, చమురు దిగుమతులు ఆ దేశాలు నిలిపేయాల్సిందేనని అమెరికా సోమవారం స్పష్టం చేసింది.
ఇరాన్ దెబ్బ: భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల?
అమెరికా ఆంక్షలపై తగ్గని చైనా, ఇరాన్కు మరింత దగ్గరగా
అమెరికా వార్నింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధర 74.26 డాలర్లుగా ఉంది. 0.3 శాతం పెరిగింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్లో 65.93 డాలర్లు (0.6 శాతం) అధికంగా ఉంది. అమెరికా భావిస్తున్నట్లు ఇరాన్ ఆయిల్ ఎగుమతులు జీరో సాధ్యమయ్యేది కాదని యూరేసియా గ్రూప్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ నుంచి చైనా రోజుకు 5,00,000 బీపీడీ (బ్యారెల్ పర్ డే) దిగుమతి చేసుకుంటోందని, అదే సమయంలో అమెరికాతో వాణిజ్య సంబంధాలు కూడా బీజింగ్కు ప్రధానమేనని, కానీ చైనా ఇరాన్ ఆయిల్ దిగుమతులు, యూఎస్ ట్రేడ్ టాక్స్కు లింక్ చేయదని అభిప్రాయపడ్డారు. ఇరాన్కు చైనా అతిపెద్ద కస్టమర్. గత ఏడాది చైనా దాదాపు 29.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకుంది. అంటే రోజుకు 5,85,400 బీపీడీ. అంటే చైనా మొత్తం ఆయిల్ దిగుమతుల్లో ఇది 6 శాతం. అమెరికా నిర్ణయంపై చైనా ధిక్కార స్వరం వినిపించింది. పెద్దన్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇరాన్ నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై చైనా తగ్గడం లేదని చెబుతున్నారు. అమెరికా నిర్ణయంతో ఇరాన్ నుంచి చైనాకు క్రూడాయిల్ ఎగుమతులు మరింత పెరిగే అవకాశముందని, ఇది రోజుకు 1 మిలియన్కు (1మిలియన్ బీపీడీ) పెరిగే అవకాశముందని ఎస్ఈబీ చీఫ్ కమోడిటీస్ ఎనలిస్ట్ జార్నే షీల్డ్రోప్ అన్నారు. ఈ నిర్ణయంతో ఇరాన్కు చైనా మరింత దగ్గరవుతుందని భావిస్తున్నారు.
ఇరాన్ సంబంధాలు భారత్కు ఎంతో ముఖ్యం
మరోవైపు, భారత్.. ఇరాన్ క్రూడాయిల్ దిగుమతి అంశానికి సంబంధించి అమెరికా ఆంక్షలపై తర్జన భర్జన పడుతోంది. అయితే చైనాలాగే ఇండియా కూడా మెట్టు దిగకపోవచ్చునని భావిస్తున్నారు. ఇరాన్ ఆయిల్ దిగుమతుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ దిగుమతులను గణనీయంగా తగ్గించే అవకాశాలు లేకపోలేదని, అదే సమయంలో రూపాయి (ఇరాన్కు భారత్ డాలర్ల రూపంలో కాకుండా రూపాయల్లో డబ్బు చెల్లిస్తోంది. పైగా రెండు నెలల పాటు అరువు ఇస్తోంది. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది) చెల్లింపు సిస్టం నేపథ్యంలో ఇరాన్ నుంచి 1,00,000 బీపీడీ (బ్యారెల్ పర్ డే)ని ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలున్నాయని, ఇక్కడ రాజకీయ శక్తి కంటే ఎనర్జీ సెక్యురిటీ నిర్ణయం ముఖ్యమని యూరేసియా గ్రూప్ అనలిస్ట్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితిని ముందే గుర్తించిన భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిందని చెప్పారు. అదే సమయంలో ఇరాన్తో సంబంధాలు భారత్కు ఎంతో ముఖ్యం మరియు చారిత్మాత్మకమని చెబుతున్నారు. ఈ సంబంధాల కోసం భారత్ తర్జన భర్జన పడుతోందని చెబుతున్నారు. అదే సమయంలో ఇరాన్ నుంచి చమురు నిలిపివేసే సంకేతాలు కూడా వస్తున్నాయని అంటున్నారు.
ఇతర దేశాల నుంచి అదనపు సరఫరా
భారత కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారంపై మంగళవారం ట్వీట్ చేశారు. చమురు శుద్ధి కర్మాగారాలకు తగినంతగా ముడిచమురు సరఫరా చేసే విషయమై స్పష్టమైన ప్రణాళిక ఉందని, దేశ అవసరాలకు తగ్గట్టుగా ఇతర దేశాల నుంచి అదనంగా తీసుకొస్తామన్నారు. ఇతర దేశాల నుంచి అదనపు సరఫరా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత కొన్నినెలలుగా సమస్యపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. కాంట్రాక్టులో పేర్కొన్నదానికి మించి దిగుమతి చేసుకొనే సౌలభ్యం ఉందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు స్పాట్ మార్కెట్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్రారు. ఉదాహరణకు సౌదీ అరేబియా నుంచి 5.6 మిలియన్ టన్నుల ముడిచమురు కొనుగోలుకు ఒప్పందం ఉండగా, అదనంగా మరో రెండు మిలియన్ టన్నులు కొనుగోలు చేయవచ్చన్నారు. ఇతర దేశాలతోనూ ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయన్నారు. అయితే వీటి కారణంగా ధరలు పెరగవచ్చునని చెప్పారు. ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుందని, అయితే దీని ప్రభావం ధరలపై ఎలా ఉంటుందో చెప్పడం కష్టమన్నారు.
భారత్పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్
ట్రంప్ ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని ఉపసంహరించుకొని, ఆ దేశంపై ఆంక్షలు విధించినప్పుడు ముడిచమురు ధర బ్యారెల్కు 85 డాలర్లకు పెరిగింది. అయితే అనూహ్యంగా కొన్ని దేశాల విషయంలో మినహాయింపులు ఇచ్చినప్పుడు యాభై డాలర్లకు పడిపోయింది. తాజాగా సోమవారం బ్యారెల్ ధర 74.46 డాలర్లు పలికింది. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యధిక ధర. మరోవైపు, ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించడం ద్వారా ట్రంప్ భారత సార్వభౌమాధికారంపై దాడి చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆంక్షలను భారత్ అంగీకరించబోదని జాతికి ప్రధాని మోడీ స్పష్టం చేయాలన్నారు. ఇది సాధారణ దాడి కాదని, అమెరికా ప్రభుత్వం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ (మెరుపుదాడి) అన్నారు. నేరుగా భారత్ను ఆక్రమించిందని మండిపడ్డారు. మనం ఎక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలో అమెరికా నిర్ణయించడం ఏమిటన్నారు. ఎన్నికల దృష్ట్యా మే 23వ తేదీ వరకు ధరలు పెంచవద్దని ప్రధాని చమురు కంపెనీలను ఆదేశించారని, ఆ తర్వాత లీడరు పెట్రోల్, డీజిల్ పైన రూ.5 నుంచి రూ.10 వరకు పెరుగుతాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా అన్నారు.