ఇరాన్పై అష్టదిగ్బంధనం: భారత్కు షాకిచ్చేలా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం, ధరలు పైపైకి!
వాషింగ్టన్/ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్వార్ కొనసాగుతోంది. ఇరాన్కు ఆదాయం లేకుండా చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ దేశం చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ సహా ఎనిమిది దేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. తమ మాట వినకుంటే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇంతవరకు ఉన్న మినహాయింపులు అన్నీ రద్దు చేస్తామని చెబుతోంది. భారత్తో పాటు చైనా, టర్కీ, జపాన్, సౌత్ కొరియా, ఇటలీ, తైవాన్, గ్రీస్లకు అల్టిమేటం జారీ చేసింది. ఈ దేశాలకు అమెరికా గత ఏడాది గడువు ఇచ్చింది. ఆ గడువు మరో పది రోజుల్లో.. అంటే మే 2వ తేదీన ముగియనుంది.
జన్ ధన్ అకౌంట్ సక్సెస్: దాదాపు రూ.1 లక్ష కోట్ల డిపాజిట్లు!
భారత్ సహా 8 దేశాలకు 180 రోజుల గడువు
ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ గత ఏడాది నవంబర్ నెలలో ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకోకూడదని చెప్పారు.పై 8 దేశాలకు మాత్రం 180 రోజుల గడువు ఇచ్చారు. ఈ ఆరు నెలల్లో ఇరాన్ నుంచి దిగుమతులను సున్నా స్థాయికి తగ్గించాలని, లేదంటే ఆంక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని నవంబర్ 4వ తేదీన స్పష్టం చేశాడు. గ్రీస్, ఇటలీ, జపాన్, కొరియా, తైవాన్లు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను చాలా వరకు తగ్గించాయి. అయితే అమెరికా తీరుపై చైనా, టర్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా తీరుపై చైనా, టర్కీ, ఇరాన్ ఆగ్రహం
అమెరికాది ఏకపక్ష నిర్ణయమని, అలాగే, పరిధిదాటి వ్యవహరిస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ కంపెనీల చట్టబద్ధమైన హక్కులను కాపాడుతామన్నారు. అమెరికా హెచ్చరికల్ని తాము పట్టించుకోమని టర్కీ విదేశాంగ మంత్రి చెప్పారు. పొరుగుదేశాలతో తాము వ్యవహరించే తీరుపై ఏకపక్ష నిర్ణయాలను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. తమపై అమెరికా ట్రేడ్ వార్ విలువలు లేని నిర్ణయమని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా విధించిన ఆంక్షలకే చట్టబద్ధత లేదని, ఇలాంటి సమయంలో తమపై మినహాయింపుల రద్దుకు ఇక విలువ ఏమి ఉంటుందని ప్రశ్నించింది. ఈ ఆంక్షలు ఎంతో కాలం నిలవవని అభిప్రాయపడింది. అయితే, దిగుమతులను పూర్తిగా నిలిపివేసేలా పై ఎనిమిది దేశాలపై ఒత్తిడిని పెంచుతామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ఈ దేశాలు తమ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే కఠిన ఆంక్షలు ఉంటాయని తేల్చి చెప్పారు. అదే జరిగితే భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం ఉండనుంది.
భారత్ స్పందన
అమెరికా తీసుకున్న నిర్ణయంపై తాము అధ్యయనం చేస్తున్నామని భారత్ చెబుతోంది. దీని ప్రభావం పైన మదింపు చేసిన అనంతరం తగిన సమయంలో ప్రకటిస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు కూడా చెబుతున్నారు. అయితే, ట్రంప్ ఆదేశాలు భారత్కు ఇబ్బందిగా పరిణమించేలా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో ఎనభై శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నవే. సౌదీ అరేబియా, ఇరాక్ల తర్వాత ఇరాన్ నుంచే భారత్ ముడి చమురును ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. ఇరాన్ నుంచి చైనా, భారత్ ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఇరాన్పై అమెరికా ఆంక్షలు మరింతగా ధరలను పెంచే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత్ పైనా ఉంటుంది. ఇటీవల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, అమెరికా తీరుతో భారత్లో మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఆయిల్కు ప్రత్యామ్నాయం ఉందా?
ఇప్పటికే అమెరికా సూచనల మేరకు భారత్ చమురు దిగుమతులు తగ్గించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం కంటే అమెరికా ఆంక్షల తర్వాత గణనీయంగా తగ్గించింది. అంతకుముందు రోజుకు 4,52,000 బ్యారెళ్లు దిగుమతి చేసుకోగా దానిని 3,00,000 బ్యారెళ్లకు తగ్గించింది. అయితే, తమ ఆంక్షల మేరకు ఇరాన్ నుంచి చమురు దిగుమతి తగ్గిస్తే తాము ప్రత్యామ్నాయం చూపిస్తామని అమెరికా చెబుతోంది. ప్రపంచంలో అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ చమురు ఉత్పత్తుల్లో ముందంజలో ఉన్నాయని, వీటితో పాటు, ఇతర మిత్ర దేశాల నుంచి ప్రత్యామ్నాయంగా సరఫరా చేస్తామని చెబుతోంది. ఇరాన్కు చమురు మార్కెట్లో స్థానం లేకుండా చేయడమే అమెరికా టార్గెట్. అదే సమయంలో ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొంది. సౌదీ అరేబియా, ఇతర ఒపెక్ దేశాలు సరఫరాలో లోటు లేకుండా చూస్తాయని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
లేదంటే అమెరికా ఆంక్షలు
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా తీసుకున్న నిర్ణయం భారత్కు ఇబ్బంది కలిగించే అంశమే. ఆరు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ 8 దేశాలకు సమయం ఇచ్చారు. తాజాగా, సోమవారం ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్ సహా ఏ దేశానికీ మినహాయింపు ఇవ్వబోమని ట్రంప్ ప్రకటించారు. ఇంతవరకు కొన్ని దేశాలకు సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఎక్సెప్షన్ ఎస్ఆర్ఈ విధానం కింద అక్కడ నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశమిచ్చారు. ఇకపై ఆ విధానం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ కాల పరిమితిని పొడిగించేది లేదని తేల్చి చెప్పారు.
అసలేం జరిగింది?
అణ్వస్త్రాల తయారీ అంశంలో అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోలేదు. దీంతో గత మే నెలలో ఇరాన్తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో గత ఏడాది నవంబర్ నుంచి ఆ దేశంపై అమెరికా ఆంక్షలు మొదలయ్యాయి. పై 8 దేశాలకు మాత్రం తాత్కాలికంగా 180 రోజుల మినహాయింపు ఇచ్చారు. ఈ గడువు వచ్చే నెల మే 2తో ముగిసిపోతోంది. ఆ తర్వాతి నుంచి ఎవరూ ఇరాన్ ముడిచమురు కొనవద్దని ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. మినహాయింపుల్ని పొడిగించవద్దని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. మే 2 తర్వాత ఇరాన్ నుంచి ఏ దేశం కూడా ముడి చమురును దిగుమతి చేసుకోవద్దని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారాసాండర్స్ స్పష్టం చేశారు. ఇరాన్ పాలకుల తీరు మారేదాకా దానిపై ఒత్తిడి ఉంటుందని ట్రంప్ ప్రభుత్వంలోని మంత్రి పాంపియో తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇరాన్పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు దిగుమతి దేశాల నుంచి వస్తున్న డిమాండ్ మధ్య గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. మే, జూన్ డెలివరీ ధరలు వరుసగా 2.2 శాతం, 2.5 శాతం చొప్పున ఎగిశాయి. దీంతో గరిష్ఠంగా బ్యారెల్ బ్రెంట్ ధర 73.78 డాలర్లకు చేరుకుంది. అమెరికా, సౌది అరేబియా, యూఏఈ దేశాల మధ్య మంచి మిత్రుత్వం ఉండటంతో అన్నీ కలిసి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండుకు తగిన సరఫరా చేసి ధరలను నియంత్రించాలని చూస్తున్నాయి.