టీసీఎస్ డేటా చోరీ కేసు: భారీ జరిమానాపై అమెరికా సాఫ్టువేర్ కంపెనీపై పోరాటం
బెంగళూరు: డాటా చోరీ కేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) హైకోర్టుకు వెళ్లింది. అమెరికాకు సాఫ్టువేర్ కంపెనీ ఎపిక్ సిస్టమ్... అయిదేళ్ల క్రితం టీసీఎస్ పైన డేటా చోరీ కేసు వేసింది. ఇందుకు సంబంధించి అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు టీసీఎస్కు భారీ జరిమానా విధించింది. దీనిపై టీసీఎస్ న్యాయపోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా తమకు విధించిన 420 మిలియన్ డాలర్ల తీర్పుపై టీసీఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టుకు వెళ్లింది.
డేటా చోరీ కేసు.. ఏం జరిగిందంటే?
ఎపిక్ సిస్టం అనే సాఫ్టువేర్ సంస్థ 2014లో టీసీఎస్ పైన కోర్టుకు వెళ్లింది. తమ మేధో సంపత్తిని దొంగిలించిందని కోర్టుకెక్కింది. దీనికి సంబంధించి టీసీఎస్కు అమెరికా కోర్టు ఏకంగా 940 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. నాటి మారకం విలువ ప్రకారం ఇది రూ.6,300 కోట్ల వరకు ఉంటుంది. క్లయింట్ వ్యాపారానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇతరులకు చేరవేసినందుకుగాను సంస్థకు వ్యతిరేకంగా నమోదైన కేసును విచారించిన కోర్టు ఈ భారీ జరిమానాను విధించింది. అనుమతిలేకుండా హెల్త్ కేర్ సాఫ్టువేర్ను ఉపయోగిస్తున్నారని, ఇందుకుగాను ఎపిక్ సిస్టమ్కు పరిహారం కింద 240 మిలియన్ డాలర్లు, కంపెనీ పరువు, ప్రతిష్టను మంటగలిపినందుకు 700 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.
నాడు కాస్త ఊరట
ఈ కేసు రెండేళ్ల పాటు విచారణ జరగగా, 2016లో కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై టీసీఎస్ పైకోర్టులో కాస్త ఊరట లభించింది. విస్కాన్సిన్లోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు జరిమానాను దాదాపు సగానికి తగ్గించింది. టీసీఎస్ వాదన విన్న కోర్టు నష్టపరిహార, చౌర్య పరిహారాన్ని 940 మిలియన్ డాలర్ల నుంచి 420 మిలియన్ డాలర్లకు తగ్గించింది. దీనిపై టీసీఎస్ న్యాయపోరాటం కొనసాగించింది. ఇందులో భాగంగా తాజాగా, పైకోర్టుకు వెళ్లింది. తాజాగా, టీసీఎస్ చికాగోలోను సెవంత్ సర్క్యూట్ కోర్టుకు వెళ్లింది.
సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయట్లేదా?: ఈ ప్రయోజనాలు ఉండవు
ఇదీ ఎపిక్ సిస్టం ఆరోపణ
టీసీఎస్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న హెల్త్కేర్ సాఫ్ట్వేర్ మెడ్ మంత్ర కోసం తమ సాఫ్టువేర్లోని సమాచారాన్ని ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం ఆరోపించింది. ఎపిక్ సిస్టంకు చెందిన యూజర్ వెబ్ పోర్టల్ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు టీసీఎస్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆ వివరాల్ని తస్కరించారని కోర్టుకు సంస్థ తెలిపింది. ఏళ్లపాటు శ్రమించి తయారు చేసుకున్న సాఫ్టువేర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని టీసీఎస్ స్వప్రయోజనం కోసం ఉపయోగించుకుందని ఎపిక్ సిస్టం పేర్కొంది.