ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం: ఈపీఎఫ్పై ట్యాక్స్ లేదు
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. 2016-17 బడ్జెట్ ప్రసంగంలో ఈపీఎఫ్లో వెనక్కి తీసుకునే కొంత మొత్తంపై పన్ను విధిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీనిపై విపక్షాల నుంచే కాకుండా ఉద్యోగులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారు. ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదన విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. దీంతో మంగళవారం పార్లమెంట్లో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఈపీఎఫ్పై ట్యాక్స్ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బడ్జెట్లో ఏమన్నారు?
ఈపీఎఫ్లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని 2016 సంవత్సరానికి గాను పార్లమెంట్లో సమర్పించిన బడ్జెట్లో పేర్కొన్నారు.
దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేటు ఉద్యోగుల్లో అధికాదాయ వర్గాలు ఈపీఎఫ్ నుంచి అత్యధికంగా లబ్ధి పొందకుండా చూసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు. 3.7 కోట్లమంది ఈపీఎఫ్ చందాదారుల్లో ఎక్కువమందికి తాజా నిర్ణయం ప్రభావం ఏమీ ఉండదని చెప్పారు.
పింఛను కోసమే ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదన చేశామని దానిని సరిగా అర్థం చేసుకోలేదని జైట్లీ వివరణ ఇచ్చారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా భారత్ను పింఛనుతో కూడిన సమాజంగా మార్చాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు.
మరోవైపు 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో రెవెన్యూ శాఖ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. మూలధనానికి పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్1,2016 నుంచి పీఎఫ్ ఖాతాల్లో జమయ్యే డబ్బులో 60 శాతంపై వచ్చే వడ్డీపైనే పన్ను భారం ఉంటుందన్నారు.