ఏప్రిల్ 1 నుండి మార్పులు ఇవే: కొత్త ట్యాక్స్ రూల్స్ నుండి ఇళ్ల ధరల వరకు
ప్రతి నెల ప్రారంభమైనప్పుడు మనీ సంబంధిత మార్పులు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022-2023)లో అలాగే, వచ్చే నెల ఏప్రిల్ 1 నుండి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను నుండి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అప్ డేట్, ఈపీఎప్ వడ్డీ పైన కొత్త ట్యాక్స్ రూల్స్, కరోనా చికిత్సపై ట్యాక్స్ ట్రీట్మెంట్ రిలీఫ్ వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి.
ఈపీఎప్, ఇల్లు, క్రిప్టోపై పన్ను
- వర్చువల్ డిజిటల్ అసెట్స్ అన్ని ట్రాన్సుఫర్లను 30 శాతం పన్ను కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించింది. ఇది మూలధన ఆస్తియా లేక మరొకటా అనే అంశంతో సంబంధం లేకుండా పన్ను విధింపు ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి క్రిప్టో కరెన్సీల ఆదాయాలపై ముప్పై శాతం పన్ను అమల్లోకి వస్తుంది.
- సొంతింటి కొనుగోలుకు సంబంధించి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.5 లక్షలు మినహాయింపు ఇక సాధ్యం కాదు. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ మినహాయింపు వర్తించదు. 2022 బడ్జెట్లో ఈ మినహాయింపును కేంద్రం కొనసాగించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది భారమే.
- పీఎఫ్ ఖాతాలో అదిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను భారం పడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలు దాటితే అదనంగా జమ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీపే పన్ను విధిస్తారు. ఒకవేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక ఉద్యోగి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తే పన్ను వేయదగిన మొత్తాన్ని వేరే ఖాతాలో వేస్తారు. దీనిపై వచ్చిన వడ్డీపై పన్ను విధిస్తారు. ఉద్యోగి వాటా ఏడాదిలో రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే పన్ను లేదు.
కార్ల ధరలు అప్
- పోస్టాఫీస్ పథకాలైన మంత్లీ ఇన్కం స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల నుండి వచ్చే వడ్డీ ఆదాయం ఇక నుండి నగదు రూపంలో ఇవ్వరు. ఏప్రిల్ 1వ తేదీ నుండి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లిస్తారు.
- ఏప్రిల్ 1వ తేదీ నుండి కార్ల ధరలు పెరుగుతున్నాయి. బీఎండబ్ల్యు, టయోటా, మెర్సిడెజ్ బెంజ్, ఆడి తదితర కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముడి సరుకు ధరలు పెరగడమే ఇందుకు కారణం. టయోటా 4 శాతం, బిఎండబ్ల్యు 3.5 శాతం, బెంజ్, ఆడి 3 శాతం చొప్పున పెరగనున్నాయి.
సిలిండర్ ధరల సవరణ
- గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల సవరిస్తాయి పెట్రోలియం కంపెనీలు. ఏప్రిల్ 1వ తేదీన సవరిస్తాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుండి సెక్షన్ 80సీసీడీ(2) కింద స్టాండర్డ్ డిడక్షన్కు అర్హులు.
- ప్రస్తుతం లిస్టెడ్ ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై 15 శాతం సర్ఛార్జ్ పరిమితి ఉంది. 14 ఏప్రిల్ 2022 నుండి ఈ పరిమితి అన్ని ఆస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పొడిగిస్తున్నారు.