LTC క్యాష్ వోచర్ గుడ్న్యూస్: బీమా ప్రీమియంకూ వర్తింపు.. ఈ తేదీల మధ్య
న్యూఢిల్లీ: LTC నగదు ఓచర్ పైన కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బొనాంజా కింద ఎల్టీసీ నగదు ఓచర్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదట ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ తర్వాత ప్రయివేటు ఉద్యోగులకు ఎల్టీసీ వోచర్ పథకాన్ని అప్లై చేసింది. తాజాగా ఉద్యోగులకు మరో వార్త చెప్పింది.
ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా?
ఈ తేదీల మధ్య బీమా పాలసీలకు కూడా
అక్టోబర్ 12, 2020 నుండి మార్చి 31, 2021 మధ్య కొత్తగా తీసుకున్న బీమా పాలసీల కోసం ఉద్యోగులు చెల్లించిన ప్రీమియంలకు కూడా ఈ పథకం కింద రీయింబర్సుమెంట్స్ పొందవచ్చునని తెలిపింది. ఈ మేరకు డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా తెలిపింది. ఉద్యోగులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు ఒరిజినల్ బిల్లులకు బదలు ఫోటో కాపీలు కూడా పెట్టవచ్చునని తెలిపింది. అక్టోబర్ 12వ తేదీన ఎల్టీసీ నగదు ఓచర్ స్కీంను కేంద్రం ప్రకటించింది.
ఉద్యోగులకు...
కరోనా నేపథ్యంలో డిమాండ్ను పెంచే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) వోచర్ వెసులుబాటును కల్పించింది. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా పండుగ సీజన్లో డిమాండ్ పెంచేందుకు ఆర్థిక శాఖ ఉద్యోగులకు ఊరట కలిగించింది. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంను మరింతమందికి అందుబాటులోకి తెచ్చింది. నాన్-సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. వీరికి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తామని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వరంగ పని చేసే ఎంప్లాయీస్, ప్రయివేటు రంగ ఉద్యోగులకు కూడా ఎల్టీసీ వోచర్ స్కీం అందుబాటులో ఉంటుంది. ఎల్టీసీ ఓచర్ స్కీం కింద ఉద్యోగి కుటుంబం ప్రయాణ ఖర్చును సెలవు దినం లేదా ఉద్యోగుల సొంత పట్టణానికి వెళ్లే ప్రయాణ ఖర్చులను సంస్థ తిరిగి చెల్లిస్తుంది. రీయింబర్స్మెంట్ పరిధి ఉద్యోగి హోదాకు లోబడి ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి ఆదాయపుపన్ను చట్టం కింత ఎల్టీసీకి మినహాయింపు ఉంది. నాలుగు సంవత్సరాల బ్లాక్లో రెండు ప్రయాణాలకు మినహాయింపు అనుమతిస్తారు.
నిబంధనలు
ఎల్టీసీ వోచర్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 12 శాతం లేదా ఆ పైన జీఎస్టీ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అది కూడా డిజిటల్ రూపంలో ఉండాలి. అక్టోబర్ 12, 2020 నుండి మార్చి 31, 2021 లోపు ఎల్టీసీ క్యాష్ వోచర్ను వినియోగించాలి. అయితే ఎల్టీసీ వోచర్కు మూడు రెట్ల ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.50వేల వోచర్కు అర్హులు అనుకుంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. జీఎస్టీ నెంబర్, జీఎస్టీ వివరాలు తెలియజేయాలి.