ఉద్యోగాలు కాపాడాలా, ప్రాణాలా అనే గందరగోళం వద్దు: IMF, WHO
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలు కావాలంటే ముందు ప్రాణాలతో ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వెల్లడించాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా చీకట్లోకి వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయవ్యాప్తంగా తిరిగి కార్యకలాపాలు పుంజుకోవాలంటే కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రావాలని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, IMF ఎండీ క్రిస్టిలినా అన్నారు.
EMI వాయిదా లక్షల భారమే: ఎన్ని నెలలు ఆగితే ఎంత పెరుగుతుంది?
అన్నీ ఆపేసి.. దేశాలు ఒక్కటిగా
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మందికి వైరస్ సోకిందని, 65వేల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను నియంత్రించేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రజా వ్యవస్థను స్తంభింప చేసి, ఆర్థిక వ్యవస్థలను నిలిపివేసి మరీ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగాలు కాపాడాలా.. ప్రాణాలు కాపాడాలా అంటే?
చాలా చోట్ల ప్రజల ప్రాణాలు కాపాడాలా లేక ఉద్యోగాలు కాపాడాలా అనే కోణంలో ఆలోచనలు ఉన్నాయని, ఇది సరికాదని, ముందు వైరస్ కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడం ద్వారా ప్రజలను, జీవనోపాధిని కాపాడవచ్చునన్నారు. చాలా పేద దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కరోనా మహమ్మారిపై సిద్ధంగా లేవన్నారు.
రెండు సంక్షోభాలు ముడివడి ఉన్నాయి
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంక్షోబం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఒకదాంతో ఒకటి ముడివడి ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే కరోనాపై పోరాడాలని తెలిపారు. ఉద్యోగులు, వస్తు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంతో మహమ్మారి నియంత్రణ కష్టమవుతోందన్నారు. అత్యవసర ఆర్థిక సాయం చేయాలని 85 దేశాలు కోరాయని, అందుకే 50 బిలియన్ డాలర్ల విపత్తు సహాయక నిధిని 100 బిలియన్ డాలర్లకు పెంచినట్లు తెలిపారు.