వొడాఫోన్ ఐడియాకు ఆర్థిక కష్టాలు: ఆర్డర్స్ ఆలస్యం, 1,500 మంది ఉద్యోగుల తొలగింత
నోకియా, ఎరిక్సన్, హువావే, జెటీఈ వంటి టెలికం గేర్ వెండర్స్ వొడాఫోన్ ఐడియా నుండి 4జీ పరికరాల కోసం కొత్త ఆర్డర్స్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నాయట. ఇందుకు ప్రధాన కారణంగా నగదు సమస్యతో ఇబ్బందులు పడుతున్న టెల్కోల నుండి పేమెంట్స్ తిరిగి పొందడంపై భయాల నేపథ్యంలో ఆలస్యం చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా వృద్ధి మందగించింది. సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. దీంతో వొడాఫోన్ ఐడియాను మరింత నష్టాలకు గురి చేస్తోంది.
రియల్ ఎస్టేట్, ఉద్యోగులు: బెంగళూరు ఐటీ క్లస్టర్ను మార్చిన వర్క్ ఫ్రమ్ హోమ్!
ఖర్చుల తగ్గింపు.. ఉద్యోగులపై వేటు
ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం వంటి వివిధ కారణాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులను మరింతగా తగ్గించుకునే లక్ష్యందో ఉద్యోగులపై వేటు వేసినట్లుగా తెలుస్తోంది.
అందుకే.. 1500 మంది ఉద్యోగులపై వేటు
దేశవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్టీఈ 4జీ పరికరాల కొత్త ఆర్డర్స్ ఆలస్యం కావడం వల్ల సంస్థ మరింత ఇబ్బందుల్లోకి వెళ్లిందని భావిస్తున్నారు. చైనా నుండి ఆర్డర్స్ తీసుకోవడం కూడా ఆగిపోయి ఉండవచ్చునని అంచనా. టెలికం సర్కిల్స్ను 22 నుండి 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సర్కిల్స్ తగ్గిన నేపథ్యంలో దాదాపు 1500 మంది ఉద్యోగులపై వేటు పడిందని తెలుస్తోంది. మే నెల నుండి వేటు వేశారని తెలుస్తోంది.
ఆర్థిక కష్టాల్లో వొడాఫోన్ ఐడియా
గత క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఏజీఆర్ మొత్తం బకాయిలు చెల్లిస్తే తమ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయని, ఈ క్రమంలో చెల్లింపులకు 20 ఏళ్ల సమయం కావాలని కూడా సుప్రీం కోర్టును కోరింది. ఇందులో 20,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 11,705 మంది శాశ్వత ఉద్యోగులు.
కాగా, తొలగించిన ఉద్యోగులకు నిబంధనల మేరకు చెల్లింపులు చేస్తారు. సీనియర్ ఉద్యోగులకు నిష్క్రమణ నిబంధనలకు లోబడి ఏడు నెలల వేతనం అందిస్తారు. గత మార్చి నాటికి రూ.1,12,520 కోట్ల రుణాలు ఉన్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం పరికరాల సరఫరా కోసం రూ.4000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.