రుణాలిచ్చిన వారు ఒకే చెప్పారు: కరోనా దెబ్బకు దివాలా కోర్టుకు అమెరికా దిగ్గజ విమాన కంపెనీ
కరోనా మహమ్మారి దెబ్బతో వ్యక్తులు, చిన్న సంస్థల మొదలు దిగ్గజ కంపెనీల వరకు కుదేలవుతున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన అమెరికన్ బ్రాండ్ లార్డ్ అండ్ టేలర్ సహా వివిధ పెద్ద కంపెనీలు దివాలా పిటిష్ దాఖలు చేశాయి. తాజాగా అమెరికా దిగ్గజ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటింక్ దివాలా ప్రక్రియ నిమిత్తం అమెరికా కోర్టులో దరఖాస్తు చేసుకున్నది. సంస్థ రక్షణ కోసం కోర్టులో బ్యాంక్రప్టసీ పిటిషన్ ఇచ్చింది.
అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్!
దివాళా ప్రక్రియ.. నిలదొక్కుకుంటాం
కరోనా టూరిజం, రవాణా రంగాలపై పెను ప్రభావాన్ని చూపించింది. ఈ రంగాలను కుదిపేసింది. భారీ నష్టాలను మిగిల్చింది. ఈ క్రమంలో బ్రిటన్లో దివాలా ప్రక్రియకు వెళ్లిన వర్జిన్ అట్లాంటిక్, ఇప్పుడు అమెరికాలోను ఆ దిశగానే అడుగులు వేసింది. ఇందులో భాగంగా అమెరికా ఫెడరల్ దివాలా కోర్టులో చాప్టర్ 15 కింద దరఖాస్తు చేసింది. సంస్థ రుణదాతలు దివాలా ప్రక్రియకు మద్దతు ఇస్తున్నారని, తిరిగి నిలదొక్కుకోగలమని వర్జిన్ అట్లాంటిక్ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.
దివాలా.. కోర్టు ప్రక్రియలో భాగం
ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా వర్జిన్ అట్లాంటిక్ దివాలా ప్రక్రియకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత నెలలో ప్రకటించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ముందుకు తీసుకు వెళ్లేందుకు దివాలా ప్రక్రియకు దరఖాస్తు అనేది యూకేలో కోర్టు ప్రక్రియలో భాగమని వర్జిన్ అట్లాంటిక్కు ప్రతినిధి ఒకరు తెలిపారు. సంస్థ నిర్వహణ భారంగా మారడంతో ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది వర్జిన్ అట్లాంటిక్.
కార్యకలాపాలు నిలుపుదల
వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకులు బ్రిటన్కు చెందిన రిచర్డ్ బ్రాన్సన్. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా వర్జిన్ అట్లాంటిక్ ఏప్రిల్ నెలలో కార్యకలాపాలు నిలిపివేసింది. జూలైలో తిరిగి విమాన సేవలను పునరుద్ధరించింది. వర్జిన్ అట్లాంటిక్ గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ఒప్పందాన్ని ఆవిష్కరించింది. దీనికి డెల్టా ఎయిర్ లైన్స్ సహా షేర్ హోల్డర్స్, రుణదాతల మద్దతు ఉన్నట్లు తెలిపింది.