అమెరికా ప్రవాస భారతీయులకు షాక్, గ్రీన్కార్డుపై కొత్త 'కఠిన' నిబంధన: ఏమిటి, ఎందుకు?
అమెరికా నేటి నుండి (సోమవారం, 24 ఫిబ్రవరి 2020) నుండి కీలక నిబంధనను అమలులోకి తెస్తోంది. అమెరికాలోని వలసదారులకు ఇది కఠిన నిబంధన. వలసదారులు ప్రభుత్వ పథకాలపై ఆధారపడితే గ్రీన్ కార్డు రాకపోవడం లేదా శాశ్వత నివాసాన్ని తిరస్కరించే నిబంధన అమలులోకి వస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు సహా అందరికీ ప్రతికూలంగా మారే అవకాశముంది. కాగా, ట్రంప్ భారత్ పర్యటన రోజునే కొత్త నిబంధన ప్రారంభం కావడం యాదృచ్ఛికం.
Trump India tour: ఆర్థిక అంశాల కంటే అదే ప్రాధాన్యమా?
పన్ను చెల్లింపుదారులకు విదేశీయులు భారం కాకుండా...
అమెరికాలో శాశ్వత నివాస హోదాను కోరే విదేశీయులు ఎవరు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా నిషేధం విధిస్తోంది. తమ దేశంలోని పన్నుచెల్లింపుదారులపై వలసదారులు అదనపు భారంగా కాకుండా నిరోధించేందుకు నేటి నుండి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకు వస్తోంది.
చాలాకాలంగా ఉన్న భారతీయులపై ప్రభావం
హెచ్1బీ వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం దీర్ఘకాలికంగా నిరీక్షిస్తున్న భారతీయులు సహా ఇతర దేశాలకు చెందిన ఎంతోమందిపై ఈ ప్రభావం ఉంటుంది. మన దేశానికి చెందిన వేలాది మంది ఉన్నారు. దీనిని సోమవారం నుండి అమలు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టీఫానీ గ్రీషమ్ అన్నారు.
పేద అమెరికన్ల కోసం పథకాలు
తమ దేశంలోని పేదల కోసం అమెరికా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. తక్కువ ధరకు ఆహార స్టాంప్స్ అందించడం, ఉచిత విద్య, ఆరోగ్య పథకాల వంటివి అందుబాటులో ఉంటాయి.
అమెరికన్ల కంటే వలసదారులే ఎక్కువ.. పన్ను భారం
ప్రభుత్వ పథకాలను పేద అమెరికన్ల కంటే వలసదారులు ఎక్కువగా వినియోగించుకుంటున్నారని భావిస్తున్నారు. దీంతో అమెరికాకు చెందిన పన్ను చెల్లింపుదారులపై అధిక భారం పడుతుందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ సంక్షేమ పథకాల నుండి లబ్ధి పొందే ఇమ్మిగ్రేంట్స్ను అమెరికాలో పబ్లిక్ ఛార్జ్ అంటారు. పబ్లిక్ ఛార్జ్ సంఖ్యను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది.
వీసా పొడిగింపు లేదు.. గ్రీన్ కార్డ్ ఇవ్వరు
పబ్లిక్ ఛార్జ్ సంఖ్యను తగ్గించేందుకు గత ఏడాది ఆగస్ట్ 14వ తేదీన ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే వారికి వీసా గడువు పొడిగించలేమని, గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత నివాస హోదా ఇవ్వబోమని పేర్కొంది.
ఆధారాలు చూపించాలి... కోర్టు వల్ల జాప్యం
వీసా కార్డు గడువు పొడిగింపు కోరుకునే వారు లేదా గ్రీన్ కార్డు కోరుకునే విదేశీయులు నిర్దేశిత పరిమితికి మించి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోలేదని ఆధారాలు కూడా సమర్పించాలి. గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన ఇది అమలు కావాల్సి ఉంది. కానీ కోర్టులకు వెళ్లడంతో జాప్యం అయింది. సుప్రీం కోర్టు శుక్రవారం ట్రంప్ సర్కారుకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో అడ్డంకులు తొలగిపోయి, ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారు.
ఎవరికి ఎక్కువగా దెబ్బ?
ట్రంప్ సర్కార్ తాజా నిబంధన వల్ల అమెరికాలోని దక్షిణాసియన్లపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం పడనుందని ఓ అధ్యయనంలో తేలింది. 2018లో 19 ఆసియా దేశాల్లోని 8 దేశాలకు చెందిన వారు ఎక్కువగా పేదరికంలో మగ్గుతున్నారు. అమెరికాలో 50 లక్షల మంది వరకు దక్షిణాసియన్లు ఉన్నారు. వారిలో దాదాపు 4.72 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. 15.8 శాతం మంది పాకిస్తానీలు, 23.9 శాతం మంది నేపాలీలు, 24.2 శాతం బంగ్లాదేశీలు, 33.3 శాతం భూటానీలు పేదరికంలో ఉన్నారు. అమెరికాలోని 61 శాతం నాన్ సిటిజన్ బంగ్లాదేశీ కుటుంబాలు, 48 శాతం నాన్ సిటిజన్ పాకిస్తానీ కుటుంబాలు, 11 శాతం నాన్ సిటిజన్ భారతీయ కుటుంబాలు సంక్షేమ పథకాల నుండి లబ్ధి పొందుతున్నట్లు 2018 నివేదిక చెబుతోంది.