అణిచివేత: ఫేస్బుక్కు అమెరికా, 48 రాష్ట్రాలు భారీ షాక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం అమ్మేస్తుందా?
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు షాక్ తగిలింది. వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించి చిన్నచిన్న ప్రత్యర్థులను అణిచివేస్తోందని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం, 48 రాష్ట్రాలు ఈ కంపెనీపై కోర్టుల్లో దావా వేశాయి. అమెరకా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC), 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ఫేస్బుక్ నిబంధనలను పక్కన పెట్టి చిన్న చిన్న ప్రత్యర్థి సంస్థలను వశం చేసుకుంటోందని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపిస్తోంది.
ఇన్స్టాగ్రాం నుండి వాట్సాప్ వరకు..
సోషల్ మీడియాలో తన ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేవారు లేకుండా మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఈ సోషల్ మీడియా దిగ్గజం వ్యవస్థీకృత వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2012లో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఇన్స్టాగ్రాంను 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా, 2014లో మొబైల్ యాప్ వాట్సాప్ను 19 బిలియన్ డాలర్లతో వశం చేసుకుంది. ప్రత్యర్థి సంస్థలకు డబ్బులు ఆశ చూపించి కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
పోటీ సంస్థలు ఉనికిలో లేకుండా..
సోషల్ మీడియాలో పోటీ సంస్థలు ఉనికిలో లేకుండా చేస్తోందని, ఇందుకు అవసరమైతే కొనుగోలు చేస్తోందని, ఇది పోటీతత్వానికి ప్రమాదకరమని, దీంతో వినియోగదారులకు ఎంచుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఫెడరల్ కమిషన్ తన ఫిర్యాదులో తెలిపింది. గత పదేళ్ళుగా చిన్న చిన్న సంస్థలను వశం చేసుకుంటూ ప్రత్యర్థులు లేకుండా చూసుకుంటోందని, ఇలాంటి విధానాలకు ఫేస్బుక్ దూరంగా ఉండేలా ఆంక్షలు విధించాలని, వ్యక్తిగత నెట్ వర్కింగ్లో పోటీని పునరుద్ధరించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
ఫేస్బుక్ ఖండన
ఈ వ్యాజ్యాన్ని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ కౌన్సిల్ జెన్నీఫర్ న్యూస్టెడ్ ఖండించారు. కావాలనే ప్రభుత్వం ఈచర్యలకు పాల్పడుతోందని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు పతనమయ్యాయి. ప్రారంభంలో గత క్లోజింగ్ (283.40 డాలర్లు) కంటే ఎగిసినప్పటికీ, ఆ తర్వాత 2 శాతం మేర నష్టపోయాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రాంను విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. అక్టోబర్లో అల్ఫాబెట్ పైన ఇలాంటి ఆరోపణలు రాగా, వ్యాజ్యం దాఖలైంది. ఇప్పుడు ఫేస్బుక్ పైన వచ్చాయి.