గంటకు 15 డాలర్లు: ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెంపు: 30 నుంచే అమలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనం భారీగా పెరగనుంది. ఈ మేరకు అక్కడి ఫెడరల్ ఏజెన్సీ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనం గంటకు 15 డాలర్లకు పెంచాలని సూచించింది. ఈ నిర్ణయం వల్ల 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ప్రధానంగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, అగ్రికల్చర్ అండ్ వెటరన్ అఫైర్స్ ఉద్యోగుల వేతనం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల హామీ మేరకు
తాము అధికారంలోకి వస్తే- భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం వంటి రంగాల్లో పని చేసే బ్లూ కాలర్ వర్కర్లకు మరిన్ని ప్రయోజనాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారి వేతనాలను పెంచడం వల్ల మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక ప్రమాణాలు మెరుగు పడతాయని, కొనుగోలు శక్తి పెరుగుతుందని అప్పట్లో బైడెన్న చెప్పారు.
గత ఏడాది కాంట్రాక్ట్ వర్కర్లకు..
మార్కెట్లో డబ్బులు రొటేట్ అవుతుందని, ఇది దేశ ఆర్థిక పరిస్థితికి కూడా మేలు చేస్తుందని ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే- దీన్ని అమలు చేశారు కూడా. గత సంవత్సరం జో బైడెన్- ఫెడరల్ కాంట్రాక్ట్ వర్కర్ల కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లకు పెంచారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు. ఆయన అమలు చేసిన ఈ చర్య వల్ల ఆయా సెక్టార్లకు చెందిన కాంట్రాక్ట్ వర్కర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.
ఎన్నికల హామీ అమలు..
ఇప్పుడు తాజాగా- ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై వారి జీతాన్ని గంటకు 15 డాలర్లుగా నిర్ధారిస్తుంది బైడెన్ సర్కార్. జో బైడెన్ ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని అమలు చేసినట్టయిందని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కిరణ్ అహూజా చెప్పారు. ఈ నెల 30వ తేదీ నుంచి కొత్త వేతనాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అన్ని ఫెడరల్ గవర్నమెంట్ ఏజెన్సీలను ఆదేశించామని అన్నారు.
ఎవరెవరికి పెంపు..
వైల్డ్ ల్యాండ్ ఫైర్ ఫైటర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ టెక్నీషియన్స్, కస్టోడియల్ వర్కర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఉద్యోగులు, అన్ని మిలటరీ బేస్ సిబ్బంది వేతనాలు పెరుగుతాయి. వేతనాల పెంపుదల నుంచి పోస్టల్ సర్వీసులు, పోస్టల్ రెగ్యులేటరీ కమిషన్ ఉద్యోగులను మినహాయింపునిచ్చారు. వారి జీతంలో పెరుగుదల ఉండదు. గత ఏడాది కాంట్రాక్ట్ వర్కర్లు.. ఈ దఫా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచడం పట్ల అక్కడి ఫెడరల్ ఎంప్లాయిస్ యూనియన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.