1994 తర్వాత మొదటిసారి... వడ్డీ రేట్లు భారీగా పెంచిన ఫెడ్
అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. 1994 తర్వాత అంటే 28 ఏళ్లలో మొదటిసారి అత్యధికంగా పెంచింది. కరోనా తగ్గుముఖం పట్టడం, అలాగే, పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అడ్డుకట్ట వేయడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇందులో భాగంగా భారత్కు చెందిన ఆర్బీఐ గత నెలలో 40 బేసిస్ పాయింట్లు, ఇటీవల 50 బేసిస్ పాయింట్లు మొత్తం 90 బేసిస్ పాయింట్లు పెంచింది. యూఎస్ ఫెడ్ కూడా వరుసగా పెంచుతోంది.
అమెరికాలో ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. దీనికి కళ్ళెం వేయడానికి అమెరికన్ కేంద్ర బ్యాంకు ప్రామాణిక రుణ రేట్లను 0.75 శాతం పెంచింది. దీంతో రుణ రేట్ల శ్రేణి కరోనా పూర్వ (2020 మార్చి నాటి) స్థాయి 1.5-1.75 శాతానికి చేరుకుంది. గత 28 ఏళ్లలో ఇది అతిపెద్ద పెంపు. ధరల్ని అదుపులోకి తేవడానికి మున్ముందు పరపతి సమీక్షల్లోను వడ్డీ రేట్లను మరింత పెంచనున్నట్లు ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇచ్చింది.
ఆహార, ఇంధన ధరలు పెరగడంతో మే నెలలో అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ 1981 నాటి గరిష్ఠ స్థాయి 8.6 శాతానికి చేరింది. వచ్చే ఏడాది చివరినాటికి ఫెడ్ వడ్డీ రేటు 3.8 శాతాన్ని అందుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ ఏడాది అమెరికా జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది ఫెడ్. ధరల పెరుగుదల కారణంగా వ్యవస్థలో కార్యకలాపాలు మందగించాయి. ఈ ప్రభావం చూపింది. 2022 క్యాలెండర్ ఏడాదికి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాను 4.3 శాతం నుండి 5.2 శాతానికి పెంచింది.