మూడేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు, 0.25% పెంచిన అమెరికా
వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 0.25 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక మార్కెట్లను ఫెడ్ నిర్ణయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. 2018 తదుపరి తర్వాత మళ్లీ రేట్ల పెంపు బాట పట్టింది యూఎస్ ఫెడ్. రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశంలో చివరకు ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) కఠిన విధానాల వైపు మొగ్గు చూపింది. కరోనా ప్రభావం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫెడ్ పాలసీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రారంభంలో 0.50 శాతం వడ్డీ రేటు పెంచవచ్చుననే వాదనలు వినిపించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 0.25 శాతం పెంచుతారని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి నెలలో అమెరికా ద్రవ్యోల్భణం 42 ఏళ్ళ గరిష్టానికి చేరుకుంది. ఏకంగా 7.9 శాతానికి చేరుకుంది. నిరుద్యోగిత భారీగా తగ్గి 3.8 శాతానికి పరిమితమైంది. దీంతో వడ్డీ రేట్ల పెంపుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెంపు మూడేళ్లలో మొదటిసారి. చివరిసారి 2018 డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను పెంచారు. ఆ తర్వాత వివిధ కారణాలతో స్థిరంగా కొనసాగించడం లేదా తగ్గించడం జరిగింది. అంటే మూడేళ్ల తర్వాత మళ్లీ వడ్డీ రేట్లు పెరిగాయి.
ఫెడ్ తాజా నిర్ణయంతో ఫండ్స్ రేట్లు 0.25 శాతం నుండి 0.5 శాతానికి పెరిగాయి. కరోనా మహమ్మారి తగ్గిన నేపథ్యంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచింది. వడ్డీ రేటు పెంచడంతో వినియోగదారులు, వ్యాపారులకు అధిక రుణ వడ్డీ రేట్లు ఉంటాయి.