చైనీస్ కంపెనీలతో ముప్పు, బలమైన ఆధారం: ఇండియా తర్వాత చైనీస్ కంపెనీలకు అమెరికా షాక్
వాషింగ్టన్: ఇప్పటికే భారత్ 59 చైనీస్ యాప్స్ను నిషేధిస్తూ షాకిచ్చింది. అగ్ర రాజ్యం అమెరికా కూడా చైనా కంపెనీలను దెబ్బకొట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం ట్రేడ్ వార్ ముగుస్తుందనే సమయంలో కరోనా మహమ్మారి రూపంలో ఈ దేశాల మధ్య వాగ్యుద్ధం మరింత పెరిగింది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ టెక్నాలజీ దిగ్గజాలు హువావే, జెడ్టీఈ నుండి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ప్రకటించింది.
టిక్టాక్ బ్యాన్, గంటకు లక్షల్లో దూసుకెళ్లిన చింగారీ: చైనాకు రూ.వందల కోట్ల నష్టం
హువావే, జెడ్టీఈపై నిషేధం
హువావే, జెడ్టీఈ నుండి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(US-FCC) మంగళవారం ప్రకటించింది. ఈ సంస్థల నుండి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. దీంతో అమెరికాలో టెలికం సర్వీసెస్ను విస్తరించే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనివర్సల్ సరవీస్ ఫండ్ నిధులతో ఈ సంస్థల నుండి పరికరాలు కొనుగోలు చేయకూడదు. ఇతర సేవలను పొందడానికి కూడా ఆ నిధులను వినియోగించవద్దు.
ముప్పుపై బలమైన ఆధారాలు
అమెరికా జాతీయ భద్రతకు వాటి నుండి ప్రమాదం ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయని FCC చైర్మన్ అజిత్ పాయ్ చెప్పారు. 5జీ భవిష్యత్తుకు సైతం సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ఆ దేశ సైనిక వ్యవస్థతో ఈ రెండు కంపెనీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ సంస్థల నిబంధనలు చైనా నిఘా వ్యవస్థలకు సహకరించే చట్టాలకు లోబడి ఉన్నాయన్నారు.
టెక్నాలజీ వ్యవస్థని కొల్లగొట్టే అవకాశమివ్వం
కాంగ్రెస్ పరిశీలనలు, నిఘా వర్గాల అభిప్రాయాలు, ఇతర దేశాలలోని సర్వీస్ ప్రొవైడర్ల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నామని, ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అమెరికా సమాచార, సాంకేతిక వ్యవస్థలను కొల్లగొట్టేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
హువావే మనుగడకే ప్రమాదం
కాగా, ఈ ఏడాది FCCకి పరికరాల కొనుగోలు కోసం 8.3 బిలియన్ డాలర్లు కేటాయించారు. అమెరికా మొబైల్ నెట్ వర్క్ వ్యవస్థను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు US-FCC తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 5జీ టెక్నాలజీకి సంబంధించి మౌలిక వసతుల ఏర్పాటులో హువావే కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అమెరికా నిర్ణయంతో ప్రభావం పడవచ్చు. సంస్థ మనుగడకే ఇది ప్రమాదమని చెబుతున్నారు.
హువావే, జెడ్టీఈ...
అమెరికా తాజా నిర్ణయంపై హువావే, జెడ్టీఈ స్పందించాల్సి ఉంది. అయితే గతంలోనే FCC చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే టెలికమ్యూనికేషన్ పరికరాల కంపెనీల్లో హువావేను గత ఏడాది చేర్చింది అమెరికా. అప్పుడు ట్రేడ్ బ్లాక్ లిస్ట్లో చేర్చారు ట్రంప్. చైనా పరికరాలపై FCC మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.