ఆవిరైపోతున్న ఉద్యోగాలు- 9 వారాల గరిష్టానికి నిరుద్యోగిత రేటు..
కరోనా సంక్షోభం తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యోగాల పరిస్ధితి చిగురుటాకుల్లా మారిపోతోంది. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చిన్నా చితకా సంస్దల నుంచి మొదలుపెడితే పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల వరకూ ఇదే పరిస్ధితి. దీంతో ప్రతీ ఉద్యోగీ ఇప్పుడు దినదిన గండంగా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. ఇదే విషయాన్ని తాజాగా ఎన్నో అధ్యయన సంస్ధలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఇదే కోవలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన గణాంకాల్లో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 9 వారాల గరిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆ ఒక్క నెలలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయి, ఆందోళనకరమే!
నిరుద్యోగిత పైపైకి...
దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం తర్వాత మారిన పరిస్ధితులు సాధారణ ప్రజలనే కాదు ఉద్యోగులను, యాజమాన్యాలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక వీరంతా ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు. ఇదే విషయం తాజాగా నిర్వహిస్తున్న పలు సర్వేల్లో తేలింది. ఇదే కోవలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సీఎంఐఈ సంస్ధ విడుదల చేసిన గణాంకాల్లోన దేశవ్యాప్తంగా నిరుద్యోగిత భారీగా పెరుగుతున్నట్లు స్పష్టమైంది. సంక్షోభం పేరుతో ఉద్యోగాల్లో పలు కార్పోరేట్ సంస్ధలు విధిస్తున్న కోతలు, ఆఫీసుల్లో పని ఎప్పటిలా చేసుకోలేని పరిస్ధితులు నిరుద్యోగితను పెంచుతున్నట్లు తెలింది.
9 వారాల గరిష్టానికి..
సీఎంఐఈ గణంకాల ప్రకారం దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతం 9 వారాల గరిష్టానికి చేరుకుంది. తాజాగా ఆగస్టు 16తో ముగిసిన వారానికి దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతం తాజాగా 9 వారాల గరిష్టానికి చేరుకుని 9.1 శాతంగా నమోదైంది. ఇందులో పట్టణ, నగర ప్రాంతాల్లో నిరుద్యోగిత శాతం 9.61 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.6గా తేలింది. దేశవ్యాప్తంగా చూస్తే జూన్ 14న మొత్తం నిరుద్యోగిత రేటు 11.63 శాతంగా నమోదైంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 13.10శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10.96 శాతంగా నమోదైంది. జూలై నెలలో మాత్రమే చూసినా దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 7.43 శాతంగా నమోదైంది. అంతెందుకు కేవలం ఆగస్టు నెల ఆరంభం నుంచి మూడో వారానికి పెరిగిన నిరుద్యోగిత శాతం చూస్తే పరిస్ధితి తీవ్రత అర్ధమవుతుంది. ఆగస్టు ఒకటిన 8.2 శాతంగా ఉన్న నిరుద్యోగిత ఆగస్టు 18 కల్లా 9.1 శాతానికి చేరందంటే ఏ స్ధాయిలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
లాక్ డౌన్ సడలింపులతో...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్రం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన వ్యవసాయ కార్యకలాపాలు కూడా నిరుద్యోగిత రేటు పెంచుతున్నట్లు వెల్లడైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన తాజా రిపోర్టులో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు మందగించడంతో యువత తిరిగి ఉద్యోగాల కోసం నగరాల బాట పడుతున్నారని, దీంతో నిరుద్యోగిత పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశం ఉన్నట్లు సీఎంఐఈ అంచనా వేస్తోంది.
అత్యధిక నిరుద్యోగిత ఇక్కడే...
దేశవ్యాప్తంగా చూస్తే నిరుద్యోగిత అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా హర్యానా నమోదైంది. ఇక్కడ గరిష్టంగా 24.5 శాతం నిరుద్యోగిత నమోదైంది. ఆ తర్వాత స్ధానాల్లో పాండిచ్చేరి, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా ఉన్నాయి. అలాగే అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా 1.9 శాతంతో మెరుగైన స్ధితిలో ఉండగా.. ఆ తర్వాత స్ధానాల్లో మేఘాలయ, అసోం, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, సిక్కిం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ 9 శాతం నిరుద్యోగిత కనబరుస్తుండగా.. ఏపీలోనూ 8.3 శాతం నిరుద్యోగిత ఉన్నట్లు తేలింది. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా యువత ఉద్యోగాల కోసం తీస్తున్న పరుగులు, వాటి ద్వారా పెరుగుతున్న నిరుద్యోగితను తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.