73% పెరగనున్న భారత కుబేరులు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుసా? టాప్ నగరాలు..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల (UHNWI) జాబితా పెరుగుతోంది. భౌగోళిక, రాజకీయ అస్థిరతలు, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ కుబేరుల సంపద పెరుగుతోంది. భారత్లో 5,986 మంది కుబేరులు ఉన్నారు. ఈ సంఖ్య 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,354కు చేరుకుంటుందని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉంటే UHNWI (అల్ట్రా హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్)గా పరిగణిస్తారు. అంటే రూ.200 కోట్లకు పైగా సంపద.
ఆకాశం నుండి పాతాళానికి యస్ బ్యాంక్, ఐనా షేర్లు ఎందుకు పెరిగాయి: SBI కొనుగోలు చేస్తే..?
అమెరికాలో 2 లక్షల మందికి పైగా
ప్రపంచంలో అత్యధిక అల్ట్రా రిచ్ ఉన్న దేశం అమెరికా. ఇక్కడ 2,40,575 మంది ఉన్నారు. చైనాలో 61,587, జర్మనీలో 23,078 మంది ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. భారత్లో ప్రస్తుతం 5,986 మంది ఉన్నారు.
అత్యధిక సంపద కలిగిన నగరాలు
ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన నగరం న్యూయార్క్. ఆ తర్వాత లండన్, ప్యారిస్ నిలిచాయి. భారత్ నుండి ముంబై 44వ స్థానం, ఢిల్లీ 58వ స్థానం, బెంగళూరు 89వ స్థానంలో ఉన్నాయి.
రెండో అతిపెద్ద కేంద్రంగా ఆసియా
2024 నాటికి ఐరోపాను వెనక్కి నెట్టి ప్రపంచంలో రెండో అతిపెద్ద సంపద కలిగిన కేంద్రంగా ఆసియా నిలుస్తుందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ అయిదేళ్లలో ఆశియాలో సంపన్నుల సంఖ్య 44% పెరుగుతుందని అంచనా.
ఇండియా ప్రధాన మార్కెట్
2022 వరకు భారత జీడీపీ తిరిగి 7 శాతానికి చేరుకుంటుందనే అంచనాలతో శ్రీమంతుల సంఖ్య కూడా ఆ స్థాయికి పెరిగే అవకాశముందని భావిస్తున్నట్లు నైట్ ఫ్రాంక్ చైర్మన్, ఎండీ శిశిరే బైజూల్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తులు, సేవలకు ఇండియా ప్రధాన మార్కెట్గా మారిందని, అంతర్జాతీయ కంపెనీలకు ఉత్పాదక కేంద్రంగా భారత్ అవతరించిందన్నారు.
ఎక్కడ పెట్టుబడి పెట్టారంటే?
ఇండియాలో మొత్తం UHNWIలలో 83% మంది ఈక్విటీల్లో, 77% మంది బాండ్స్లో, 51% మంది ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2019లో UHNWIలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విభాగాల వారీగా చూస్తే 29% ఈక్విటీలు, 21% బాండ్స్, 20% రియల్ ఎస్టేట్లో, 7% బంగారంలో పెట్టుబడులు పెట్టారు.
ఆసియాలో భారత్ ముందు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి నమోదవుతున్న తొలి ఇరవై దేశాల్లో ఆరు ఆసియాలోనే ఉన్నాయి ఐరోపా నుండి ఐదు, ఆఫ్రికా నుండి మూడు దేశాలు ఉన్నాయి. ఇక, ఆసియాలో చూస్తే 73% వృద్ధితో భారత్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత 64 శాతంతో వియత్నాం, 58 శాతంతో చైనా, 57 శాతంతో ఇండోనేషియా ఉన్నాయి. భారత్లో కుబేరుల సంఖ్య పెరిగినప్పటికీ ఉత్తర అమెరికాలోని శ్రీమంతుల సంఖ్యలో సగమే ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో శ్రీమంతుల సంఖ్య 22 శాతం పెరుగుతుందని అంచనా.