మార్కెట్లో భారీ నష్టాల దెబ్బ, 15 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపేసిన స్టాక్ ఎక్స్చేంజ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పాటు చమురు ధరలు భారీగా తగ్గడంతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఈక్విటీ సూచీ S&P ప్రారంభ ట్రేడింగ్లో 7% మేర పతనమవడంతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ను 15 నిమిషాల పాటు నిలిపివేసింది. భారత్, అమెరికా.. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
కరోనా, క్రూడాయిల్ దెబ్బ: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
కరోనా, క్రూడాయిల్ దెబ్బతో ఆయా దేశాల్లో మార్కెట్లు నష్టపోయాయి. అమెరికాలో డోజోన్స్ 7 శాతానికి పైగా, ఎస్ అండ్ పీ 6.81 శాతం, నాస్డాక్ 6 శాతానికి పైగా, బ్రిటన్లో ఎప్టీఎస్ఈ 7.69 శాతం, జర్మనీలో డాక్స్ 7.94 శాతం, చైనాలో షాంఘై 8.39 శాతం, జపాన్లో నిక్కీ 3.01 శాతం, హాంగ్కాంగ్లో హాంగ్సెంగ్ 4.23 శాతం, ఫ్రాన్స్లో సీఏసీ 8.39 శాతం మేర నష్టపోయాయి. భారత మార్కెట్లో సెన్సెక్స్ 5.17 శాతం, నిఫ్టీ 4.90 శాతం నష్టపోయాయి.
కరోనాకు క్రూడాయిల్ ధరల యుద్ధం తోడవడం స్టాక్ మార్కెట్లను దెబ్బకొట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పడిపోవడంతో సోమవారం భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూల్చాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. దీంతో దేశీయ మార్కెట్లు గతంలోలేని నష్టాలు చూశాయి. ఉదయం ప్రారంభం నుంచే భారీ నష్టాలు ఉన్నాయి.