అమితాబ్, అక్షయ్, ధోనీ, సచిన్కు సెగ!: చైనా వస్తువులు బహిష్కరిద్దాం... కానీ కండిషన్
చైనా దుందుడుకు చర్య వల్ల సరిహద్దుల్లో ఘర్షణ కారణంగా 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా 43 మంది వరకు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. డ్రాగన్ దేశం తీరుపై భారతదేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా వస్తువులు బహిష్కరిద్దామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఐదువందల వస్తువులతో జాబితా విడుదల చేశారు.
సరిహద్దులో ఉద్రిక్తత: చైనా నుండి ఇండియా కంపెనీల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు
దిగుమతులు 13 బిలియన్ డాలర్లకు తగ్గాలి
చైనా వస్తువులు బహిష్కరించాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు ట్రేడర్స్ విజ్ఞప్తి చేశారు. CAIT దేశవ్యాప్తంగా 7 కోట్ల ట్రేడర్స్, 40,000 ట్రేడ్ అసోసియేషన్స్కు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇది చైనా వస్తువులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది. వచ్చే ఏడాది నాటికి చైనా నుండి ఇందుకు సంబంధించిన దిగుమతులు 13 బిలియన్ డాలర్లకు తగ్గేవిధంగా చూడాలని భావిస్తున్నాయి. ప్రస్తుతకం 70 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువుల్లో బహిష్కరించాలని పిలుపునిచ్చిన వాటిలో బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, హోమ్ అప్లియెన్సెస్ తదితర వస్తువులు ఉన్నాయి.
మీరు ప్రచారం చేయకండి
తాము సాధ్యమైనంత వరకు వీటిని విక్రయించడం మానివేస్తామని, ప్రజలు కూడా కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చిన ట్రేడర్స్ మరో షరతును కూడా విధిస్తున్నారు! బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, క్రీడాకారులు మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండుల్కర్ వంటి ప్రముఖులు కూడా చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఇది సాధ్యమేనా అనే ప్రశ్న అలాగే ఉంది.
చైనా వస్తువుల బహిష్కరణకు మేం సిద్ధం.. షరతులతో
ఢిల్లీ సదర్ బజార్లో దాదాపు 40,000 దుకాణాలు ఉంటాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద టోకు మార్కెట్. ఈ దుకాణాల్లో ఎక్కువగా చైనీస్ బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, వాచీలు, హోమ్ అప్లియెన్సెస్ ఉంటాయి. వారికి ఎక్కువ ప్రయోజనం ఇందులోనే ఉంటుంది. అలాగే కొనుగోలుదారులకు కూడా ఇవే చౌక. ఈ నేపథ్యంలో బాలీవుడ్, క్రికెట్ స్టార్స్ చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని, అప్పుడే ఇది ఎంతోకొంత విజయవంతమవుతుందని ట్రేడర్స్ చెబుతున్నాయి. అందుకే వారు చైనీస్ ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని కండిషన్ పెడుతున్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ చైనీస్ ఉత్పత్తులకు ప్రచారం చేస్తే వీరు బహిష్కరించి ప్రయోజనం లేకుండా పోతుంది.
మేం అదే కోరుకుంటున్నాం
మేం కూడా చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని కోరుకుంటున్నామని, ఇప్పటి వరకు హిందీ -చీనీ బాయి బాయి అని, ఇక నుండి హిందీ-చీనీ బైబై అనడం సరైనదని సదర్ బజార్ ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర శర్మ అన్నారు. కానీ ట్రేడర్స్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలని, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు.
70 శాతం చైనా వస్తువులే
దాదాపు 70 శాతం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చైనా నుండి వస్తున్నాయని, దీపావళి సందర్భంగా బిలియన్ డాలర్ల ఫెయిరీ లైట్స్ కొనుగోలు చేస్తామని, పంప్స్ నుండి బొమ్మలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వరకు చైనా వస్తువులేనని, వీటిని తగ్గించాల్సి ఉందని ట్రేడర్స్ అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో డిఫెన్స్ కాలనీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. తాము చైనా వస్తువులపై యుద్ధం ప్రకటించామన్నారు. ప్రతి ఒక్కరు తమ చైనా వస్తువులను పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మేం యుద్ధం చేయలేం కానీ.. ఆర్థికంగా కొట్టగలం
డిఫెన్స్ కాలనీ చైనా వస్తువులపై యుద్ధం చేయడంలో ముందు ఉందని ప్రెసిడెంట్ రంజిత్ సింగ్ అన్నారు. దురదృష్టవశాత్తు తాము బుల్లెట్లు, తుపాకులతో సైనికుల వలె యుద్ధం చేయలేమని, కాబట్టి సైనికులకు అండగా ఉండేందుకు, చైనాకు ఆర్థికంగా బలం ఇస్తున్న చైనా వస్తువుల కొనుగోళ్లను పక్కన పెట్టాలని నిర్ణయించామన్నారు.