రూ.8,000 కోట్లు చెల్లించిన టెల్కోలు, టాటా 'సర్దుబాటు' చెల్లింపు: AGR లెక్కల్లో భారీ తేడా
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వివిధ టెల్కోలు AGR బకాయిలను చెల్లిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలు రూ.8,000 కోట్ల బకాయిలను చెల్లించాయి. టాటా టెలి సర్వీసెస్ కూడా ఏజీఆర్ డ్యూస్ చెల్లించింది. AGR బకాయిలలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలవే భారీ మొత్తం ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించేందుకు తమకు సమయం కావాలని కోరుతూనే, సుప్రీం ఆదేశాల మేరకు క్రమంగా చెల్లింపులు జరుపుతున్నాయి.
ముందే జాగ్రత్తపడండి! మార్చి-ఏప్రిల్లో వీటి ధరలు పెరగనున్నాయి, ఏ ధర ఎంత శాతం పెరగనుంది?
రూ.8000 కోట్లు చెల్లింపు
AGR బకాయిలకు సంబంధించి టెల్కోలు మంగళవారం డిపార్టుమెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ (DoT)కి మరో రూ.8,000 కోట్లు చెల్లించాయి. ఇందులో వొడాఫోన్ ఐడియా రూ. 3,043.80 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ.1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 2,000 కోట్లు చెల్లించాయి.
టాటా టెలీ సర్వీసెస్ ఎందుకు చెల్లించిందంటే
ఇప్పటికే పూర్తి సెటిల్మెంట్ కోసం రూ.2,197 కోట్లు చెల్లింపులు చేశామని టాటా టెలీ సర్వీసెస్ వెల్లడించింది. అయితే ఒకవేళ లెక్కల్లో ఏమైనా వ్యత్యాసం వస్తే సర్దుబాటు చేసేందుకు వీలుగా అదనంగా ఈ మొత్తం కట్టినట్లు తెలిపింది. టెలికం సంస్థలు మార్చి 17వ తేదీ నాటికి తమ చెల్లింపులు జరపాలి. స్పెక్ట్రం వినియోగ రుసుము కింద చివరి విడతగా ఇప్పుడు టెలికం సంస్థలు ఈ నిధులు చెల్లించాయి. రెండేళ్ల క్రితం ఈ రుసుము చెల్లింపుకు ప్రభుత్వం మారటోరియం ఇవ్వడంతో ఇప్పుడు జమ చేస్తున్నాయి.
టెలికం శాఖ కార్యదర్శితో వొడాఫోన్ ఐడియా సీఈవో భేటీ
మరోవైపు, వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్తో భేటీ అయ్యారు. సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది. AGR లెక్కల ప్రకారం లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీ బకాయిల కింద 15 టెల్కోలు దాదాపు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాలి. AGR బాకీల విషయంలో టెల్కోల స్వీయ మదింపు, తమ లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయా సంస్థలకు టెలికం శాఖ లేఖలు రాస్తోంది.
DoT లేఖలు..
AGR బకాయిల లెక్కింపుకు సంబంధించి తమ గణనకు, టెలికం సంస్థల స్వీయ మదింపుకు తేడా ఎక్కడ వస్తుందో తెలుసుకునేందుకు DoT ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై తాజాగా లేఖలు పంపిస్తోంది. AGR బకాయిలని చెబుతూ చెల్లింపులు జరిపిన సంస్థలు, అదే తుది మొత్తం అని ప్రకటించాయి. DoT అంచనాల కంటే ఈ మొత్తం చాలా తక్కువ. అందుకే Dot తాజాగా లేఖలు రాస్తోంది.
సర్దుబాటు..
భారతీ ఎయిర్టెల్ రూ.18,004 కోట్లు చెల్లించింది. ఇందులో రూ.5,000 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ముందస్తుగా చెల్లించినట్లు పేర్కొంది. కానీ ఎయిర్ టెల్ నుండి రూ.35000 కోట్లు డాట్ ఆశిస్తోంది. టాటా టెలీ సర్వీసెస్ రూ.2,197 కోట్లు, తాజాగా రూ.2,000 కోట్లు చెల్లించింది. మొత్తం రూ.4,197 కోట్లు చెల్లించింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, వడ్డీ, జరిమానా బకాయిల కింద ఈ మొత్తం చెల్లించింది. వొడాఫోన్ ఐడియా మొత్తం రూ.3800 కోట్లు చెల్లించి, ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయో లెక్కిస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా నుండి రూ.53,000 కోట్లు రావాలని డాట్ భావిస్తోంది.