స్టార్టప్ లాభం లేదు... జాబే బెటర్ గురు! మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కుంటున్న స్టార్టప్ లీడర్లు
ఎన్నో ఆశలు... మరెన్నో కలలు. వాటిని సాకారం చేసుకునేందుకు సొంత వ్యాపారమే బెటర్ అనే ఆలోచనలు చాలా మందిని నిద్ర పోనివ్వవు. అలా కొంత కాలం తర్వాత ఓ రోజు బాస్ సర్ప్రైజ్ అయ్యేలా రెసిగ్నషన్ లెటర్. నేను రాజీనామా చేస్తున్నా సర్. సొంతంగా ఒక స్టార్టుప్ కంపెనీ స్థాపిస్తున్నా అని బాస్ తో చెప్పేస్తారు. అప్పుడు బాస్ అతన్ని లేదా ఆమెను తన రాజీనామా వెనక్కి తీసుకొమ్మని, లేదా ఒక వారం, పది రోజులు సమయం తీసుకుని బాగా ఆలోచించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఎప్పుడెప్పుడు సొంత బిజినెస్ ప్రారంబిద్దామా, ఒక్కో మెట్టూ పైకెదిగి త్వరలోనే మిలియనీర్, కుదిరితే బిలియనీర్ అవుదామా అన్న ఆలోచనలు వారిని కుదురుగా ఉండనివ్వవు. అన్నీ ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా సర్.
ఇక ఇదే ఫైనల్ అని ఖరాఖండిగా చెప్పేస్తారు. చేసేది లేక.. బాస్ కూడా అల్ ది బెస్ట్ చెప్పి వదిలేస్తాడు. అప్పుడు... ఇక ప్రపంచంలో మనల్ని ఎవరూ ఆపలేరని, కోరుకున్న ఆశల సౌధాన్ని సొంతంగా నిర్మించుకోబోతున్నాని ఒకటే సంతోషం. ఓ వారమో, పది రోజులో రెస్ట్ తీసుకుని, స్టార్టుప్ పని మొదలు పెడతారు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు... తర్వాత చూస్తే పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. సరిగ్గా ఇప్పుడు మన దేశంలో అలాంటి ట్రెండ్ నడుస్తోంది.
మందగమనం నుంచి బయటపడేందుకు నిర్మలమ్మ ఈ 5 చేయాలి!
మళ్ళీ కొలువులకు జై...
ఇండియా లో 2010 తర్వాత మొదలైన స్టార్టుప్ బూమ్ చూసి, చాలా మంది అటు వైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా టెక్నాలజీ బాక్గ్రౌండ్ ఉన్న వారు చాలా ఎక్కువ సంఖ్యలో అటు వైపు వెళ్లారు. చాలా స్టార్టుప్ కంపెనీలు, కేవలం టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్నవారికి పెట్టుబడి లేకున్నా వాటాలు ఇచ్చి భాగస్వాములుగా చేర్చుకున్నాయి. ఇంకొందరికి సీనియర్ పోసిషన్ లో ఉద్యోగంతో పాటు కంపెనీలో కొన్ని షేర్ల ను కేటాయించాయి. ఇలాంటి ఇన్సెంటివ్స్ కు ఆకర్షితులు అవటంతో పాటు... సరిగ్గా 2014 ఆ తర్వాత స్టార్టుప్ కంపెనీల్లోకి మిలియన్ డాలర్ల కొద్దీ ఫండింగ్ వస్తుండటంతో రంగుల కలలు అధికమయ్యాయి. కానీ స్టార్టుప్ కంపెనీలను నెలకొల్పి ఏడాది నుంచి మూడేళ్ళ లోపు అవి నిలదొక్కుకోకపోవటంతో విసుగు చెంది లేదా అలసి పోయి మళ్ళీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. మళ్ళీ ఉద్యోగ జీవితానికి జై కొడుతున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
9,000 టెక్ స్టార్టప్ లు...
గత ఐదేళ్లలోనే ఇండియాలో సుమారు 9,000 కు పైగా టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. నాస్కామ్, జిన్నోవ్ అనే పరిశోధన సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వీటిలో అధిక వేతనాలు, ఈ షొప్స్, ఏదో కొత్తగా చేసే అవకాశం లభించటంతో అప్పటికే పెద్ద పెద్ద ఐటీ, ఎం ఎన్ సి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్టార్టప్ ల వైపు ఆకర్షితులయ్యారు. 2016 లో దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఫిన్ టెక్ కంపెనీల హవా కొనసాగింది. కాబట్టి, గత ఐదేళ్ళలో ఒక్కో స్టార్టప్ లో 5-10 మంది ఉన్నతోద్యోగులు ఇలా చేరిన వారు ఉన్నారు. కానీ ఒకటి రెండు స్టార్టుప్ లు మినహా మిగితావి ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేక పోయాయి. దీంతో, భవిష్యత్ కూడా అంధకారంగా మారిపోయింది. అందుకే ఇక మళ్ళీ ఉద్యోగమే బెటర్ అనే ఆలోచనలో పడ్డారు వీరంతా.
ఫండింగ్ రావటం లేదు...
స్టార్టప్ కంపెనీలు చాలా వరకు ఫండింగ్ సాధించలేక పోయాయి. నిధులు రాబట్టిన కంపెనీలు సైతం వాటిని విపరీతమైన ఆఫర్లు గుప్పించి కాష్ బర్న్ చేశాయి. దీంతో ఫండింగ్ లేకపోతే సొంతంగా తన కాళ్లపై తాను నిలబడలేని పరిస్థితి. అయితే, గత ఐదేళ్లుగా ఇన్ఫోసిస్, విప్రో, కాప్ జెమినీ వంటి టాప్ కంపెనీల్లో అట్ట్రిషన్ రేటు పెరిగిపోతోంది. గతంలో అయితే, ఇది పోటీ కంపెనీలకు వెళ్ళటం వల్ల జరిగేది కానీ ఇప్పుడైతే స్టార్టుప్ కంపెనీలకు వెళ్లేవారి వల్ల జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని, వారిలో చాలా మంది మళ్ళీ రెసుమె లతో హైరింగ్ కంపెనీల ను ఆశ్రయిస్తాయిస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఏం జరగనుందో.