పనిలేకున్నా కోట్లాదిమందికి వేతనాలు: టాటా గ్రూప్ హామీ, మెడికల్ రంగంలోకి ఎంట్రీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని, ప్లాన్తో వెళ్తే ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన వృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్లోని కంపెనీల తాత్కాలిక ఉద్యోగుల గురించి కూడా ఆయన మాట్లాడారు. గ్రూప్లోని కంపెనీల వార్షిక ప్రణాళికలపై ఆరా తీస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో వార్షిక ఆదాయాలపై అంచనా వేస్తున్నామన్నారు.
Forbes List: జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీయే టాప్! 4గురు తెలుగువారికి చోటు
పని చేయని కాలంలోను వేతనాలు
వివిధ కంపెనీలు ఉద్యోగాల తొలగింత, శాలరీ కట్ గురించి ఆలోచిస్తున్నాయి. మరిన్ని కంపెనీలు ఉద్యోగులకు ధీమాను ఇస్తున్నాయి. కాగ్నిజెంట్ వంటి సంస్థలు కొంత అదనపు వేతనం అందిస్తున్నాయి. లాక్ డౌన్ లేదా పని చేయని కాలానికి తమ వద్ద ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని ఇదివరకే టాటా గ్రూప్ వెల్లడించిందన్నారు. అదే కొనసాగుతుందని చంద్రశేఖరన్ చెప్పారు.
100 మిలియన్ల ఉద్యోగులకు వేతనాలు
పైస్థాయి నుండి కిందిస్థాయి వరకు 100 మిలియన్ల ఉద్యోగులకు పని చేయని దినాల్లో కూడా జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉంటారన్నారు. సంక్షోభంతో వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా పోర్ట్పోలియో కఠిన నిర్ణయాలకు దారి తీస్తుందన్నారు.
పునర్నిర్మాణ సమయంలో కఠిన నిర్ణయాలు
పోర్ట్పోలియో పునర్నిర్మాణ ప్రణాళిక ఇప్పటికే వేగవంతం కావాల్సి ఉండగా, విలువైన సమయాన్ని కోల్పోయామన్నారు. కొన్ని వ్యాపారాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా నిర్వహిస్తున్నారని, వాటిని పునర్నిర్మించాల్సిన అవసరముందన్నారు. పోర్ట్పోలియో పునర్నిర్మాణ సమస్య పరిష్కరించే సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
మెడికల్ రంగంలోకి అడుగు
కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టాటా గ్రూప్ వెంటిలెటర్స్ తయారీ రంగంలోకి అడుగు పెట్టిందని చంద్రశేఖరన్ వెల్లడించారు. వెంటిలెటర్స్తో పాటు మెడికల్ పరికరాలను తయారు చేస్తామన్నారు. ఇప్పుడు మెడికల్ వ్యాపార విత్తనం ప్రారంభమైందన్నారు. టాటా గ్రూప్ ఇప్పటికే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ (PPE)లు, మాస్కులు, శానిటైజర్లు, క్రిమిసంహకార మందుల తయారీకి సహకరిస్తోందన్నారు.
ఆటోమొబైల్ రంగంపై...
కరోనా కారణంగా ఆటోమొబేల్ రంగం వ్యాపారం క్షీణించిందన్నారు. అంతకుముందే దెబ్బతిన్న వ్యాపారం ఇప్పుడు మరింత క్షీణించిందన్నారు. ఉద్దీపనల ద్వారా ఈ రంగాన్ని పునరుద్ధరించవచ్చునని చెప్పారు. చాలామందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ఉపయోగపడుతుందన్నారు.
ఉద్యోగాలు, ఇండస్ట్రీ రక్షణకు ప్రభుత్వాలు
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి ఉందని, ప్రతి ప్రభుత్వం కూడా పరిశ్రమలు, ఉద్యోగాలను సంరక్షించేందుకు ముందుకు వచ్చాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వాలు సకాలంలో జోక్యం చేసుకోవాలన్నారు.
రూ.20,000 కోట్ల మూలధనం
టాటా సన్స్ గత మూడేళ్లలో గ్రూప్ కంపెనీల్లో రూ.20,000 కోట్ల మూలధనాన్ని జొప్పించిందన్నారు. ఇటీవలి కాలంలో టైటాన్, ట్రెంట్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL), టాటా గ్లోబల్ బీవరెజెస్ లిమిటెడ్ వంటి కన్స్యూమర్ ఫోకస్డ్ గ్రూప్ కంపెనీలు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్స్ కంటే చాలా వేగంగా వృద్ధి సాధించాయన్నారు.