సుంకాలు తగ్గించాలని డబ్ల్యూటీవోను ఆశ్రయించిన ఈయూ, జత కలవనున్న అమెరికా
భారత మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ కు కొత్త చిక్కొచ్చి పడింది. స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఐన ఆపిల్ వంటి కంపెనీలు మన దేశం విధిస్తున్న దిగుమతి సుంకాలపై గుర్రుగా ఉన్నాయి. పరిణితికి మించి అధిక టారిఫ్ లు విధిస్తున్న ఇండియాను డబ్ల్యూ టీ ఓ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్) కు ఈడ్చాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఇండియా పై ఒక ఫిర్యాదు చేసింది. తాజాగా అమెరికా కూడా మనపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆపిల్ సంస్థ అమెరికాకు చెందిన కంపెనీయే కాబట్టి... ప్రస్తుతం ఈయూ వేసిన పిటిషన్ లో అమెరికా కూడా జత కలవాలని ఆ దేశ కాంగ్రెస్ సెనేటర్ల నుంచి భారీ స్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది.
ఒకవేళ అదే జరిగితే గనుక డబ్ల్యూ టీ ఓ లో భారత్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఏదేని కారణం చేత కేసు ఇండియాకు వ్యతిరేకంగా వస్తే... ఒక్క స్మార్ట్ ఫోన్లే కాకుండా మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్ అస్తవ్యస్తం కానుంది. డబ్ల్యూ టీ ఓ సభ్య దేశాలు ఒక పరిమితికి మించి దిగుమతులపై సుంకాలు విధించటానికి అవకాశం ఉండదు. తద్వారా ఇతర సభ్య దేశాలకు సంబంధించిన వస్తువుల రాకను అడ్డుకోవటం చేయరాదు.
బేసిక్ సుంకం తగ్గించాలి...
భారత్లో ఆపిల్, ఫాక్స్ కాన్, ఫ్లెక్స్ ట్రానిక్స్ వంటి హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ తయారీదారుల తరపున నిలబడే ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ఐ సి ఈ ఏ ) .... హై ఎండ్ స్మార్ట్ ఫోన్ల పై ఏకపక్షంగా బేసిక్ సుంకాలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. లేదంటే డబ్ల్యూ టీ ఓ లో ఇండియా కేసు ఓడిపోతే దాని ప్రభావం పూర్తిగా దేశీయ మొబైల్ ఫోన్ల రంగంపై పడుతుందని, అది దేశానికి మేలు చేయదని హెచ్చరిస్తోంది.
ఈ మేరకు ఐసిఈఏ చైర్మన్ పంకజ్ మొహీంద్రూ భారత రెవిన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే, ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ అజయ్ షానీ, కామర్స్ సెక్రటరీ అనూప్ వాధవాన్ లకు ఒక ఘాటు లేఖ రాశారు. రూ 20,000 ... ఆపైన విలువైన మొబైల్ హ్యాండ్సెట్లపై ఫ్లాట్ గా రూ 4,000 సుంకాన్ని వసూలు చేయాలని అయన కోరారు. లేదంటే డబ్ల్యూ టీ ఓ గనుక సుంకాలను తగ్గించాలని తీర్పు వెలువరించితే... అప్పుడు అది ఒక్క హై ఎండ్ మొబైల్ ఫోన్లకే పరిమితం కాదని, బేసిక్ ఫీచర్ ఫోన్లకు కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. అది దేశీయ మొబైల్ తయారీ పరిశ్రమను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
22% సుంకం...
భారత ప్రభుత్వం ప్రస్తుతం హై ఎండ్ స్మార్ట్ ఫోన్ల దిగుమతులపై 22% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ని వసూలు చేస్తోంది. ఇంతకు ముందు అది 20% గా ఉండేది. బేసిక్ సుంకాలు అధికంగా ఉండటం వల్ల ఆయా కంపెనీలు హ్యాండ్సెట్ల ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు ... ఇండియాలోనే సొంతంగా తయారు చేస్తే బెటర్ అని భావించి ఇక్కడ తయారీ మొదలు పెట్టాయి. ఇప్పటికే చాలా వరకు స్మార్ట్ ఫోన్లు మన దేశంలోనే తయారు అవుతున్నాయి. కానీ ఆపిల్ వంటి కొన్ని కంపెనీలు ఇంకా అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. పెరిగిన బేసిక్ సుంకాలు ఆయా కంపెనీలకు భారంగా పరిణమించటంతో అవి పరోక్షంగా డబ్ల్యూ టీ ఓ ను ఆశ్రయిస్తున్నాయి. కస్టమ్స్ సుంకం అధికంగా ఉండటం వల్ల స్మగ్లింగ్ కు అవకాశం ఏర్పడుతోందని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ 2,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని పంకజ్ తన లేఖలో పేర్కొన్నారు. అందుకే, సుంకాలను తగ్గించాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.
110 బిలియన్ డాలర్ల టార్గెట్...
మేక్ ఇన్ ఇండియా లో భాగంగా ఇండియాలో తయారైన మొబైల్ ఫోన్ల ను ప్రపంచానికి ఎగుమతి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఇండియాలో పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లు తయారు అవుతున్నాయి. మన దేశీ అవసరాల్లో 90% వరకు ఇక్కడ తయారైన ఫోన్లే తీరుస్తున్నాయి. పైగా ఇటీవలే ఇండియా నుంచి ఫోన్ల ఎగుమతులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మన ఎగుమతులు సుమారు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా... 2025 నాటికి వాటిని 110 బిలియన్ డాలర్ల కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో డబ్ల్యూ టీ ఓ లో భారత్ కు వ్యతిరేక తీర్పు వస్తే... అది సుంకాల తగ్గింపునకు దారితీస్తుంది.
తక్కువ సుంకాలుంటే చైనా సహా ఇతర దేశాల నుంచి అన్ని రకాల ఫోన్లు వెల్లువలా దిగుమతి అవుతాయి. అప్పుడు మన దేశీయ ఫోన్ల తయారీ పరిశ్రమ పోటీని తట్టుకోలేక చేతులెత్తేస్తుంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం దీనిపై సముచిత నిర్ణయం తీసుకుని 28 బిలియన్ డాలర్ల విలువైన దేశీయ మొబైల్ ఫోన్ల పరిశ్రమను ఆదుకోవాలని సూచిస్తున్నారు.