చిచ్చుపెట్టిన ఆర్బీఐ: ఆ ఆదేశాలపై షాక్లో బ్యాంకులు: స్టే కోసం సుప్రీంకు
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా జారీ చేసిన ఆదేశాలు.. బ్యాంకింగ్ సెక్టార్ను కుదిపేసింది.. ప్రకంపనలకు దారి తీసింది. రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయలేమని స్పష్టం చేస్తోన్నారు బ్యాంకర్లు. వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే అత్యంత సున్నితమైన, బ్యాంకు ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన విషయాలన్ని బహిర్గతమౌతాయనే ఆందోళన వ్యక్తమౌతోంది. రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏమిటా ఆదేశం
బ్యాంకులకు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీల డేటాను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకుని రావాలంటూ ఇటీవలే రిజర్వుబ్యాంకు ఆదేశించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను దీని పరిధిలోకి తీసుకొచ్చింది. ఏ ఖాతాదారుడైనా లేక ఖాతేతరుడైనా సంబంధిత బ్యాంక్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను తనకు అందజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరితే.. దాన్ని అంగీకరించాలంటూ ఆర్బీఐ ఆదేశించింది. సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారుడి కోరిక ప్రకారం.. వారడిగిన వివరాలను అందజేయాలని సూచించింది.
దీనిపై బ్యాంకర్ల అభ్యంతరం
ఈ ఆదేశాలపై బ్యాంకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. వాటిని ప్రొవైడ్ చేయలేమని స్పష్టం చేస్తోన్నాయి. రిజర్వుబ్యాంకు ఆదేశాలను అమలు చేయలేమని తేల్చి చెబుతున్నాయి. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్టే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఉమ్మడిగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు టైమ్స్ గ్రూప్కు చెందిన ప్రముఖ బిజినెస్ దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ అనిరుధ్ బోస్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్పై వాదనలు చేపట్టినట్లు పేర్కొంది.
విచారణకు స్వీకరించిన సుప్రీం..
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలైన ఈ రెండూ ఆర్బీఐ ఆదేశాలను గట్టిగా వ్యతిరేకిస్తోన్నాయని, గోప్యంగా ఉంచాల్సిన బ్యాంకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం సమాచార హక్కు పరిధిలోకి తీసుకుని రాలేమని స్పష్టం చేశాయి. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. స్టేట్ బ్యాంక్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, హెచ్డీఎఫ్సీ తరఫున సీనియర్ అడ్వొకెట్ ముకుల్ రోహత్గీ తమ వాదనలను వినిపించనున్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో నెలకొన్న పోటీ వాతావరణంలో తమ ఆర్థిక మూలాలతో ముడిపడి ఉన్న సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని బ్యాంకులు స్పష్టం చేశాయి.