చైనా నుంచి కంపెనీలు రావాలంటే..: టారిఫ్-పన్నులపై ఇండియన్-అమెరికన్ గ్రూప్
భారత్ పెట్టుబడులకు అనుకులంగా ఉండటంతో పాటు 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పన్నుల్ని క్రమబద్దీకరించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. జీఎస్టీ కాంప్లియెన్స్ను మెరుగు పరచాలని సూచిస్తున్నారు. పన్నుల క్రమబద్దీకరణ... ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని, తద్వారా వృద్ధి రేటు పెరుగుతుందని భారతీయ - అమెరికన్ వ్యాపార సలహా సంఘం కేంద్రానికి సూచించింది.
ఇలా చేయండి... వృద్ధి పట్టాలెక్కుతుంది, ఉద్యోగాలు వస్తాయి
యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (USISPF) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. వివిధ రకాల పన్నుల తగ్గింపుతో పాటు సుంకాల విధానాన్ని సవరించాలని కోరింది. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవాలని కోరింది. ఈ చర్యలు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని సూచించింది. అలాగే భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పింది.
ప్రపంచస్థాయి డిజిటల్ ట్యాక్సేషన్ విధానం అవసరం
వ్యాపారాలు డిజిటల్ మోడ్లోకి మారిపోతున్నాయని, కాబట్టి భారత డిజిటల్ ట్యాక్సేషన్ విధానం ప్రపంచస్థాయిలో ఉండాలని USISPF సూచించింది. సరళ వాణిజ్య విధానాలు, పన్ను మార్గదర్శకాలు, జీఎస్టీ సమస్యలు, సీఎస్ఆర్ ఖర్చులు, డిజిటల్ ట్యాక్సేషన్ ప్రేమ్ వర్క్ వంటివి పాటించాలని తెలిపింది.
జీఎస్టీ ఈ-ఇన్వాయిసింగ్ స్కీం
బడ్జెట్లో రెండు శాతం సీఎస్సార్ ఖర్చును పన్ను మినహాయింపు అంశంగా ప్రకటించాలని సూచించింది. టెక్నికల్, లీగల్ సమస్యలను పరిష్కరించి, జీఎస్టీ ఈ-ఇన్వాయిసింగ్ స్కీంను అమలు చేయాలని, అలాగే నేచరల్ గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని సూచించింది.
ఇన్సురెన్స్ రంగంలోకి 100 శాతం FDIలు
వ్యాపారాలకు అడ్డుగా ఉన్న చట్టాలను, కస్టమ్స్ చట్టంలోని సంక్లిష్టతను పరిష్కరించాలని, ఇవి పెట్టుబడులు ప్రోత్సహించేలా ఉండాలని పేర్కొంది. బీమా రంగంలోకి 100 శాతం FDIలకు అవకాశమివ్వాలని సూచించింది. అన్ లిస్టెడ్ బీమా కంపెనీల్లో ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్ 10 శాతం వాటాలను ఉంచుకునేలా అవకాశమివ్వాలని సూచించింది.
ధరలు నియంత్రించే విధానం తొలగించాలి
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ధరలను నియంత్రించే విధానం తొలగించాలని సూచించింది. పోటీ పెరిగితే నాణ్యత పెరుగుతుందని తెలిపింది. నిత్యావసరాలపై 5 శాతం జీఎస్టిని తొలగించి, మెడిసిన్స్ పైన పూర్తిగా తొలగించాలని పేర్కొంది. టెలికం రంగంలో లైసెన్స్ ఫీజుపై, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలపై జీఎస్టీని తొలగించాలని, 5G వేగంగా విస్తరించేందుకు ఇవి దోహదం చేస్తాయని పేర్కొంది.
టారిఫ్ తగ్గిస్తే... చైనా కంపెనీలను ఆకర్షిస్తుంది
ఐసీటీ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించాలని కోరింది. ఇలా చేయడం ద్వారా ఇండియా లాంగ్ టర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటిషన్కు, డిజిటల్ లీడర్షిప్కు తోడ్పడుతుందని తెలిపింది. ఇంటర్మీడియేడ్ మరియు ఫినిష్డ్ ఐసీడీ వస్తువులు తగ్గితే మేకిన్ ఇండియాకు మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. ఇవి చైనా నుంచి తరలిపోయే కంపెనీలను ఆకర్షిస్తుందని పేర్కొంది.