న్యూఢిల్లీ: ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటిని అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధర అత్యధికంగా గోవా రాజధాని పనాజీలో కిలో రూ.165 పలికింది. కోల్కతా, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో వరుసగా రూ.140, రూ.140, రూ.102, రూ.96 పలుకుతోంది. రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉల్లి పండే రాష్ట్రాల్లో అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని ఉల్లి కొరత ఏర్పడింది.

సగటు ఉల్లి ధర రూ.100
ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిషేధించింది. విదేశాల నుంచి లక్షా 20వేల టన్నుల దిగుమతికి ఏర్పాట్లు చేసింది. చిల్లర వర్తకులు ఉల్లిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అయిదు నుంచి రెండు టన్నులకు కుదించింది. జనవరి వారం వరకు ధరలు ఇదేవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 114 నగరాల్లో ధరలను ఆధారంగా దేశవ్యాప్తంగా కిలో ఉల్లి సగటు ధర రూ.100గా ఉంది.

400 శాతం పెరుగుదల
ఉల్లి ధరలు మార్చి నెల నుంచి ఏకంగా 400 శాతం పెరిగాయి. ఈ మేరకు మంగళవారం కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ రాజ్యసభలో ఈ విషయాన్ని చెప్పారు. డిసెంబర్ 3, 2019న సగటున కిలో ఉల్లి ధర రూ.81.9గా ఉంది. అదే సమయంలో మార్చి 2019న కిలో రూ.15.87 మాత్రమే.

దేశవ్యాప్తంగా ప్రాధాన్యత
ఉల్లి ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి సాగుచేసే రాష్ట్రాల్లో దిగుబడి తగ్గింది. డొమెస్టిక్ క్రాప్ దాదాపు 26 శాతానికి పైగా నష్టపోయింది. దీంతో ధరలు పెరిగాయి. ఉల్లి ధరలు జాతీయవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ధరలు కొత్త రికార్డులు సృష్టించడం, కొంతమంది షాప్స్ నుంచి, గోదాంల నుంచి దొంగిలించడంతో పతాక శీర్షికలకు ఎక్కింది.

తిరుపతిలో రూ.150
సగటున కిలో ఉల్లి ధర ఢిల్లీలో రూ.96, ముంబైలో రూ.102, చెన్నైలో రూ.100, కోల్కతాలో రూ.140గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని తిరువనంతపురం, కోజికోడ్లలో కిలో ఉల్లి ధర ఏకంగా రూ.160కి చేరుకుంది. తిరుపతి, త్రిశూర్, పలక్కాట్, ఎర్నాకులంలో రూ.150 పలికింది.


Click it and Unblock the Notifications