అమెరికా లక్ష్యంగా ఇరాన్ దాడి, భారీగా పెరిగిన పెట్రో ధరలు
టోక్యో: అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ అమెరికా రాకెట్ లాంఛర్ల దాడిలో హతమయ్యాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా, అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాక్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు క్షిపణులతో దాడులు చేశాయి. ఇరాక్లోని ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. ఇరాక్లోని ఆల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై డజనుకు పైగా క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఖండించారు.
భారీగా పెరిగిన బంగారం, రూ.41,730కి చేరిన ధర: మూడ్రోజుల్లో ఎంత పెరిగిందంటే?
తాజా దాడి నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. బుధవారం ఉదయం చమురు ధరలు 4.5 శాతం మేర పెరిగాయి. ఖాసీమ్ దాడి తర్వాత బెంచ్మార్క్ WTI బ్యారెల్ 4.53 శాతం పెరిగి 65.54 డాలర్లకు చేరుకుంది.
ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, గత ఏడాది సెప్టెంబర్ సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడుల తర్వాత 70 డాలర్లు దాటిందని, ఇప్పుడు మరోసారి అలాంటి టెన్షన్ వాతావరణం నెలకొందని అంటున్నారు.
సౌదీ అరేబియాలో ఘటన అనంతరం చమురు ధరలు తిరిగి దిగి వచ్చాయని, ఈ అనుభవం ఉందని, కాబట్టి ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గితే మళ్లీ ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. తాజా దాడుల వల్ల ఎంత మేర నష్టం జరుగుతుందో తెలియదని అంటున్నారు.