విదేశీ రాబడి జోలికిరాం, ఆ సంపాదనకు మాత్రమే పన్ను: NRIలకు నిర్మల ఊరట
NRIలకు సంబంధించి ఆదాయపు పన్ను విషయమై నెలకొన్న సందిగ్ధతను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొలగించారు. ఎన్నారైలపై పన్ను విధిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే గల్ఫ్ వంటి విదేశాల్లోని సంపాదనపై ఈ పన్ను ఉంటుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆదివారం ఆమె స్పష్టత ఇచ్చారు. భారత్లోని ఎన్నారైల సంపదన పైనే పన్ను విధించనున్నట్లు తెలిపారు.
డివిడెండ్పై కంపెనీలకు ఊరట.. వాటా దారులకు పన్ను భారం
భారత్లోని సంపాదన పైనే పన్ను
ఎన్నారైలు కేవలం భారత్లో ఆర్జించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లించాలని సీతారామన్ తెలిపారు. ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టవలసిన అవసరం లేదన్నారు. బడ్జెట్లో ప్రవేశ పెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు, ఎన్నారైలు అయోమయానికి గురికావొద్దని చెప్పారు. ఎన్నారైలు ఇతర దేశాల్లో ఆదాయం పొందవచ్చునని చెప్పారు.
ఆ సంపాదనపై పన్ను విధించే అధికారం మాకు లేదు
ఎన్నారైలకు ఇక్కడి (భారత్) ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రమే తమకు హక్కు ఉందని నిర్మల తెలిపారు. విదేశాల్లో సంపాదించే ఆస్తులపై వచ్చే ఏ ఆదాయం పైనా పన్ను విధించే అధికారం తమకు లేదన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటన కూడా జారీ చేసింది.
విదేశీ రాబడి జోలికి రాబోము
ఎన్నారై ఇతర దేశాల్లో ఆర్జించిన సంపాదనకు పన్ను విధించడం ఉండదు. కానీ భారత్లోని వ్యాపారాలు, ఆస్తులు, వృత్తి ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్ను విధిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామన్నారు. ఎన్నారైలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎగవేసే వారిపైనే తమ దృష్టి అన్నారు. వారి విదేశీ రాబడి జోలికి తాము వెళ్లమని స్పష్టం చేశారు.
ఎన్నారై హోదాను అడ్డుపెట్టుకొని..
ఎన్నారై హోదాను అడ్డుపెట్టుకొని భారత దేశంలోని ఆస్తులపై ఆదాయం సంపాదిస్తూ పన్ను ఎగవేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకే ఎన్నారై నిర్వచనంలో మార్పులు చేసినట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఏడాదిలో 183 రోజులు విదేశాల్లో ఉన్న భారతీయులను ఎన్నారైలుగా పరిగణించేవారు. ఇప్పుడు దీనిని 245 రోజులకు పొడిగించారు.