దిగుమతులు తగ్గించి, ఉత్పత్తి ఇక్కడే చేద్దాం: కేంద్రమంత్రి సూచన
ఆటోమొబైల్ విడిభాగాలను ప్రాంతీయ తయారీదారుల నుండి కొనుగోలు చేయాలని ఆటో మేకర్ కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకున్నదని, ఎంఎస్ఎం నిర్వచనాన్ని మార్చడం ద్వారా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు.
వాహన విడిభాగాల తయారీదారుల సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న అయిదేళ్లలో ప్రపంచంలో నెంబర్ వన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీగా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పేరుగాంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఆటో రంగం గొప్ప ప్రపంచ తయారీ హబ్గా నిలిచేంత కీలకమైనదని అన్నారు.
అదేం బ్యాడ్ ఐడియా కాదు: దిగుమతి సుంకం పెంపు, లగ్జరీ కార్లు మరింత భారం!
కరోనా రూపంలో భారత వాహన, విడిభాగాల రంగం ప్రపంచ హబ్గా మారేందుకు అవకాశం వచ్చిందని, దీనిని ఉపయోగించుకోవాలని హీరోమోటోకార్ప్ సీఎండీ, సీఈవో పవన్ ముంజాల్ అన్నారు. భారత వాహన, విడిభాగాల పరిశ్రమ దిగుమతుల నుండి పూర్తిగా విడిపోరాదని, తక్కువ ధరకు అందించేలా పోటీతత్వంతో శ్రమించాలని, టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలు తీసుకు వచ్చి ప్రపంచ సరఫరా వ్యవస్థలో గొప్ప భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా అన్నారు.
చైనా నుండి పలు కంపెనీలు తరలి వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆటో, విడిభాగాల రంగాన్ని తీసుకురావడమో లేదా భారత్లో ఉత్పత్తికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడమో చేయాలని ఆటో రంగ నిపుణులు సూచించారు. ఆటోమోటివ్ పరిశ్రమ ఆర్థికంగా మళ్లీ ప్రారంభ దశలో ఉందని, కొత్త సవాళ్లు ఉన్నాయని టాటా మోటార్స్ ఎండీ గంటర్ బుషెక్ అన్నారు.