ఆదాయపు పన్ను తగ్గింపు లేదు, ప్యాకేజీలో డబ్బులు చేతికి ఎందుకివ్వలేదంటే?: నిర్మల
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామని, ఇది వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, పరిశ్రమలు తెరుచుకోవడానికి ఉపయోగపడుతుందని, దీని వల్ల కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె సీఎన్ఎన్-న్యూస్18 ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. లాక్ డౌన్ ప్రకటించగానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద తొలి ప్యాకేజీ ప్రకటించామని గుర్తు చేశారు. ఎవరూ ఆకలితో ఉండకూడదని ప్రకటించామన్నారు.
కరోనా భారత్కు సూపర్ ఛాన్స్.. ట్రంప్ గుర్తించారు, మేం 'కఠినంగానే' ఉంటాం: అమెరికా
డబ్బు నేరుగా చేతికి ఎందుకు ఇవ్వలేదంటే
ప్యాకేజీని ప్రకటించినప్పుడు చిన్న వ్యాపారులను దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని మోడీ తమకు సూచించారని నిర్మల చెప్పారు. వ్యాపారులు దివాళా తీయకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా చూడాలని చెప్పారని తెలిపారు. డబ్బు నేరుగా ప్రజలకు ఇవ్వాలని కొంతమంది చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ... డబ్బు అవసరమైన వారికి నేరుగా ఇవ్వాలని సూచించారని, కానీ వాటి కంటే ఇది అత్యుత్తమ ప్యాకేజీ అని తాము భావించామన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా సంస్థలు నిలబడటంతో పాటు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం ద్వారా నిలదొక్కుకుంటారని అభిప్రాయపడ్డారు.
అందుకే ప్యాకేజీపై ఈ మార్గం
కేవలం కొనడానికి వెళ్లినప్పుడు మాత్రమే డిమాండ్ సృష్టించబడదని, చిన్న సంస్థలకు ప్యాకేజీ ద్వారా వారు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారని, కంపెనీలు తెరుచుకోవడానికి ముడిసరుకులు కొనుగోలు చేస్తారని... ఇలా ఎన్నో ఖర్చులు పెరిగి కూడా డిమాండ్ ఏర్పడుతుందన్నారు. ప్యాకేజీకి తాము ఈ విధమైన మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా డిమాండ్ చైన్ను సృష్టించామని అభిప్రాయపడ్డారు. వ్యాపారాలు ప్రారంభమవుతాయి, కార్మికులకు వేతనాలు ఇస్తారు, వారి చేతిలో నగదు ఉంటుందన్నారు. వడ్డీ వ్యయాలు తగ్గి మూలధన సాయం పెరగాలని, కంపెనీలు వేతనాలు చెల్లించే పరిస్థితి రావాలని ఈ ప్యాకేజీ అన్నారు. వేతనాలు అందినా డిమాండ్ పెరుగుతుందన్నారు.
మరో ప్యాకేజీ లేదు...
సూక్ష్మ, మధ్యతరహా సంస్థలు తెరవడం వల్ల డిమాండ్ ఏర్పడుతుందని నిర్మల చెప్పారు. మరిన్ని ఉద్దీపన చర్యలు ఆశించవచ్చా అని ప్రశ్నిస్తే... అలాంటి ఆలోచన లేదన్నారు. ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదని, భవిష్యత్తును బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీతే పరిశ్రమలు గాడిన పడతాయన్నారు. వేతన జీవులకు వేతనాలు అందుతాయన్నారు.
పన్ను తగ్గింపు లేదు..
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత లేదా పరోక్ష పన్నుల తగ్గింపు ఉంటుందా అంటే.. నిర్మల తోసిపుచ్చారు. ప్రస్తుతం తాము పన్ను సంబంధిత అంశాలపై దృష్టి సారించలేదన్నారు. తద్వారా పన్ను తగ్గింపు లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు పెంచిన FRBMపై మాట్లాడుతూ.. రాష్ట్రాలు పెంచమని కోరాయని, సంస్కరణలు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించిన షరతులు ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సులు అన్నారు.