ఇలా ఐతే కష్టమే, స్మార్ట్ ఫోన్ ధరలు పెంచేలా చేస్తున్నారు, మోడీ మేకిన్ ఇండియాకు నష్టం
మొబైల్ ఫోన్లు, విడిభాగాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచడంపై ఈ రంగానికి చెందిన కంపెనీలు స్పందించాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ పెరిగిన జీఎస్టీ ధరలు అమలులోకి వస్తాయి. ఇది మొబైల్ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్స్పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచడం పరిశ్రమకు దెబ్బ అని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుజైన్ అన్నారు.
జీఎస్టీ పెంపు, ఏప్రిల్ 1 నుండి మొబైల్ ధరలు భారీగా పెరుగుదల: ఆ వ్యాపారులకు ఊరట
స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగేలా..
అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీ పరిశ్రమ ప్రస్తుతం లాభాల కోసం పోరాడుతోందని మనుజైన్ అన్నారు. మొబైల్ ధరలు పెంచేలా ప్రతి ఒక్కరు ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే మొబైల్ ఇండస్ట్రీలో మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా కార్యక్రమం బలహీనం అవుతుందన్నారు.
వీటికైనా తగ్గించండి
మొబైల్స్ పైన జీఎస్టీ పెంపు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మరోసారి పరిశీంచాలని మనుజైన్ కోరారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మొబైల్ సప్లయి చైన్ దెబ్బతిన్నదన్నారు. కనీసం 200 డాలర్లు దిగువన ఉన్న ఫోన్లపై ఈ జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంటే భారత కరెన్సీలో రూ.15,000కు పైన ఉంటుంది.
డిజిటల్ ఇండియాకు నష్టదాయకం
కేవలం షియోమీ మనుజైన్ మాత్రమే కాదు. ఇతర మొబైల్ కంపెనీలు కూడా పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా సెల్యూలార్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహింద్రూ మాట్లాడుతూ... డిజిటల్ ఇండియాకు ఈ పరిణామం నష్టదాయకమన్నారు.
డొమెస్టిక్ వినియోగ లక్ష్యం నెరవేరదు
2025 నాటికి రూ.6 లక్షల కోట్ల డొమెస్టిక్ వినియోగ లక్ష్యం ఇలాంటి నిర్ణయాల వల్ల దూరమవుతాయని అభిప్రాయపడ్డారు. వీటి వల్ల దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.