8ఏళ్ల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్భణ వివరాల్లేవు
కరోనా వైరస్ కారణంగా మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రారంభమైంది. ఆ నెలలో ఇండియా పారిశ్రామికోత్పత్తి (IIP) భారీగా పడిపోయింది. ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గింది. 2019 మార్చి నెల IIPతో పోలిస్తే 16.7 శాతం కుదించుకుపోయింది. ఈ మేరకు ఎన్ఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. తయారీ, విద్యుత్ రంగాలు డీలా పడ్డాయి. 2012 ఏప్రిల్ తర్వాత పారిశ్రామికోత్పత్తి ఇంత ఘోరంగా పడిపోవడం ఇదే మొదటిసారి.
పరిస్థితి దారుణం: అమెరికన్లు అప్పటి దాకా బయటకు రారు! 10 ఏళ్ల వరకు కోలుకోనంత నష్టం
కీలక రంగాల ఉత్పత్తిలో క్షీణత
తయారీ రంగం ఉత్పత్తి గత ఏడాది మార్చి నెలలో 3.1% వృద్ధి చెందగా, ఈసారి మైనస్ 20.6కు దిగజారింది. విద్యుదుత్పత్తి 2019లో 2.2% ఉండగా ఈసారి మైనస్ 3.1% ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడు నెలల గరిష్టస్థాయి 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చిలో 2.7% వృద్ధి నమోదు చేసింది. పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చిలో పారిశ్రామికోత్పత్తికి కీలకమైన 8 రంగాలు 6.47% క్షీణతను నమోదు చేశాయి.
ఏయే రంగాలు ఎలా..
తయారీ రంగం 20.6%, ఆటోమొబైల్ -49.6% (మైనస్), విద్యుత్ పరికరాలు -31% (మైనస్), హార్డ్వేర్, ఆప్టికల్ ఎక్విప్మెంట్ -41.7% (మైనస్), యంత్రపరికరాలు -35.6% (మైనస్), కన్స్యూమర్ డ్యూరబుల్స్ -33.1% (మైనస్) క్షీణించాయి. IIP భారీ క్షీణత ప్రభావం ఈ నెల ద్వితీయార్ధంలో విడుదల కానున్న జీడీపీ గణాంకాలపై కూడా భారీగా ఉండనుంది. మొత్తం 23 పారిశ్రామిక విభాగాల్లో 7 విభాగాలు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి.
ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్భణ వివరాల్లేవు
గణాంకాల సేకరణ సాధ్యపడకపోవడం వల్ల ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్భణం గణాంకాలు ప్రకటించలేదని అధికారవర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నందున అధికారులు ధరల సమాచారాన్ని సేకరించలేకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా ధరల డేటాను 1,114 పట్టణ, 1,181 గ్రామీణ విపణులలో జాతీయ గణాంక కార్యాలయం - ఆపరేషన్స్ విభాగంలోని క్షేత్ర సిబ్బంది సేకరిస్తుంది. టెలిఫోన్ ద్వారా వివరాలు సేకరించగా పాలు, పండ్లు, కూరగాయల ధరలు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పెరిగినట్లు గుర్తించారు.