లాక్డౌన్, ఉద్యోగాల కోత: 4 కోట్లమందిపై ప్రభావం, ఇండియాలో ఇదీ పరిస్థితి
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దినసరి కూలీలకు కనీస ఆధారం లేకుండా పోయింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ వంటి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్, ఉద్యోగాల కోత కారణంగా 4 కోట్ల మంది వలస కార్మికులపై ప్రభావం పడిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
కరోనా ఎఫెక్ట్: భారత్ కు తగ్గనున్న ఎన్నారై నిధులు.. ఎంతంటే?
ప్రపంచవ్యాప్త వలసల కంటె రెండున్నర రెట్లు
నెల రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల భారతదేశంలో 40 మిలియన్ల వలకదారుల జీవనోపాధిని ప్రభావితం చేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దాదాపు 50వేల నుండి 60వేల మంది వలస కార్మికులు నగరాలను విడిచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వలసలతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. లాక్ డౌన్, ఉపాధి కోల్పోవడం, సామాజిక దూరం వంటి అంశాలు ఇండియాతో పాటు లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో వలసదారులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లడానికి కారణమైంది. దీని వల్ల కరోనా మరింత పెరిగిందని పేర్కొంది.
అంతర్జాతీయ వలసలు
ప్రభుత్వాలు అంతర్గత వలసలను అడ్డుకొని సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అలాగే ఆర్థికంగా ఆదుకోవాలని సూచించింది ప్రపంచ బ్యాంకు. సామాజిక భద్రత కల్పించాలని పేర్కొంది. కరోనా ప్రభావం దక్షిణాసియా దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపిందని, అంతర్జాతీయ వలసలతో పాటు అంతర్గత వలసలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా పని చేసే భారత్, పాకిస్తాన్, బంగ్లా దేశాలకు చెందిన వలస కార్మికులు అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు రాకముందే స్వదేశాలకు వెళ్లినట్లు తెలిపింది.
భారత్, చైనా నుండి ఎక్కువ వలసలు
చైనా, ఇరాన్ వంటి దేశాలు కొంతమంది వలసదారులను పంపించవలసి వచ్చిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో అక్కడి నుండి వచ్చిన వారి నుండి వ్యాప్తి జరిగి ఉంటుందని అభిప్రాయపడింది. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కడికి అక్కడ నిలిపివేయడంతో కొంతమంది ఎక్కడికి అక్కడే ఆగిపోయారని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ నుండి పెద్ద ఎత్తున వలసలు ఉన్నాయని, ప్రస్తుత సంక్షోభ సమయంలో పలు దేశాల ప్రభుత్వాలు వలసదారుల బాగోగులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది.
విదేశీ మారక ప్రవాహం తగ్గుదల
అంతేకాదు, అంతర్జాతీయ సంక్షోభం కారణంగా భారత్ దేశానికి ఎన్నారైలు పంపించే విదేశీ మారకద్రవ్యం భారీగా తగ్గవచ్చునని ప్రపంచబ్యాంకు అంచనా వేసిన విషయం తెలిసిందే. గత ఏడాది 83 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 64 బిలియన్ డాలర్లకు పడిపోవచ్చునని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇది 20 శాతం తగ్గవచ్చునని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం యూరోప్, సెంట్రల్ ఆసియా (27.5%), సహారా ఆఫ్రికా (23.1%), సౌత్ ఏసియా (22.1%), మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (19.6%), లాటిన్ అమెరికా, కరేబియన్ (19.3%), ఈస్ట్ ఆసియా, పసిఫిక్ (13%) తగ్గుతుందని అంచనా.