పక్క రాష్ట్రంలోనూ ఆన్లైన్ గేమింగ్ బ్యాన్: అసెంబ్లీలో బిల్
బెంగళూరు: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ గేమింగ్ను ఎప్పుడో నిషేధించింది. ఈ మేరకు గత ఏడాది అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974లో సవరణలను ప్రతిపాదించింది. గేమింగ్ వెబ్సైట్లను బ్యాన్ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికీ సిఫారసు చేసింది. ఓ తీర్మానాన్ని ఆమోదించింది ఏపీ అసెంబ్లీ.
ఇక తాజాగా- అదే బాటలో ప్రయాణిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ సర్కార్కు సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దీనిపై ఓ ప్రకటన చేశారు. అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టారు. కర్ణాటక పోలీస్ (అమెండ్మెంట్) బిల్ 2021ను ఆయన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు. అన్ని రకాల వెబ్ గేమింగ్/ఆన్లైన్ గేమింగ్ను ఇందులో చేర్చింది కర్ణాటక ప్రభుత్వం. ఆన్లైన్ లేదా వెబ్ బేస్డ్ జూదం లేదా బెట్టింగ్, దానితో ముడిపడి ఉన్న ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించకూడదని ఇందులో చేర్చింది.
గేమింగ్కు ముందు లేదా ఆ తరువాత బెట్టింగ్ నిర్వహించడానికి ఉద్దేశించిన వర్చువల్ కరెన్సీ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్పైనా ఈ నిషేధాన్ని వర్తింపజేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలను విధిస్తామని తెలిపింది. నిషేధం తరువాత ఈ ఆన్లైన్ గేమ్ను ఆడుతూ పట్టుబడిన వారికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని ఈ కర్ణాటక పోలీస్ (అమెండ్మెంట్) యాక్ట్లో ప్రతిపాదించింది. మూడేళ్ల కారాగార శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధించాలని పేర్కొంది.
తొలిసారిగా పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష లేదా 10 వేల రూపాయల జరిమానా, రెండోసారి పట్టుబడితే 15 వేల రూపాయల జరిమానా ఏడాది జైలుశిక్ష, మూడోసారి పట్టుబడితే 18 నెలల కారాగారవాసంతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది. దానికి మించి పట్టుబడిన వారిపై లక్ష రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల కారాగారశిక్షను వర్తింపజేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.