గ్రీన్కార్డుదారులకు శుభవార్త, ట్రంప్ ఆంక్షలకు బిడెన్ చెల్లుచీటి
అమెరికా అధ్యక్షులు జోబిడెన్ భారత ఐటీ నిపుణులకు గుడ్న్యూస్ చెప్పారు. అమెరికాలోకి ప్రవేశించకుండా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను గత ప్రభుత్వం అడ్డుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. వీటిని బుధవారం బిడెన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గ్రీన్ కార్డు కోరుకునే వారికి ఇది భారీ ఉపశమనంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిడెన్ ప్రభుత్వం నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తామని అమెరికా ఎన్నికల సమయంలో జోబిడెన్ హామీ ఇచ్చారు. ఈ హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికాలో చాలామంది స్థానికులు ఉద్యోగాలు కోల్పోయారు. స్థానికుల హక్కులను కాపాడే ఉద్దేశ్యంతో గ్రీన్ కార్డు జారీపై ఆంక్షలు విధించింది ట్రంప్ సర్కార్. అయితే ఇది సరికాదని బిడెన్తో పాటు టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
2020 అక్టోబర్ నెలలో ఇమ్మిగ్రెంట్స్ పైన ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా, లాక్డౌన్ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్ను మూసివేత నెలల తరబడి సాగుతోన్న దరఖాస్తుల బ్యాక్లాగ్ను పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియకు ఏళ్లు పట్టవచ్చునన్నారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ట్రంప్ భ్రష్టు పట్టించాడన్నారు.