ఉద్యోగులకు షాక్, జాగ్వార్లో 2,000 ఉద్యోగాల కోత
టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) పొదుపు చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటో సేల్స్ గత ఏడాది భారీగా పడిపోయాయి. కొద్ది నెలలుగా క్రమంగా కోలుకుంటున్నాయి. పూర్తిగా కోలుకోని నేపథ్యంలో వివిధ కంపెనీలు ఖర్చలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ కూడా ప్రపంచవ్యాప్తంగా 2వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది.
SBI యాన్యుటీ స్కీం: ఇలా చేస్తే నెలకు రూ.10,000 ఆదాయం: ఇది తెలుసుకోండి..
విద్యుత్ కార్లు
ఇంగ్లండ్లోని మిడ్ ల్యాండ్స్ ఏరియా, స్లోవేకియా, భారత్, చైనా, బ్రెజిల్లోని ఉత్పాదక యూనిట్లలో ఉద్యోగులను తొలగించే అవకాశముంది. బ్రిటన్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్. ప్రస్తుతం జాగ్వార్ కంపెనీలో దాదాపు 40 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. 2024 నాటికి విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేస్తామని, 2025 నాటికి లగ్జరీ జాగ్వార్ బ్రాండ్ పూర్తి విద్యుత్ కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు సోమవారం తెలిపింది. అంతలోనే ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకుంది.
సవాళ్లు
2039 నాటికి పూర్తిగా కర్బన ఉద్గారరహిత వాహనాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసింది జాగ్వార్. రీఇమాజిన్ అనే పథకం పేరిట ప్రతి సంవత్సరం 3.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది. గత సెప్టెంబర్ నెలలో కొత్త సీఈవో నేతృత్వంలో JLRలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1960,1970లలో హైపర్ఫార్మెన్స్ ఈటైప్ మోడల్కు పేరుగాంచిన జాగ్వార్... అనేక ఇతర కార్ల తయారీదారుల మాదిరి సవాళ్లు ఎదుర్కొంటోంది.
ఎలక్ట్రిక్ వాహనాల దిశగా..
ఇప్పుడు JLR పట్టు నిలుపుకునే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతోంది. తమ లగ్జరీ కార్లు క్రమంగా రికవరీ అవుతోన్నప్పటికీ సెమీ కండక్టర్స్ కొరత, బ్రెగ్జిట్ సంబంధిత సరఫరా అంతరాయం పట్ల టాటా మోటార్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే భారత ఉత్పత్తిదారులను ఇది ఇంకా తాకలేదు.