దక్షిణాదిన నకిలీ దందా: రూ.3,300 కోట్ల హవాలా రాకెట్ రట్టు, ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి రూ.వందల కోట్లు
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్ను ఆదాయపు పన్ను విభాగం బద్దలు చేసింది. బోగస్ బిల్స్, హవాలా ట్రాన్సాక్షన్స్తో కొందరు వ్యక్తులు, కార్పోరేట్ సంస్థలు అందులో రూ.3,300 కోట్ల మేర స్వాహా చేసినట్లుగా వెలుగు చూసింది. దీంతో హైదరాబాదుతో పాటు ఢిల్లీ, ముంబై, పుణే, ఆగ్రా, గోవా, ఈరోడ్ సహా 42 చోట్ల నవంబర్ నెల తొలివారంలో ఐటీ విభాగం అధికారులు సోదాలు చేశారు. ఈ మేరకు CBDT సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆ ఉద్యోగులకు జగన్ శుభవార్త, వేతనం ఏకంగా రెండింతలు పెంపు
హవాలా డీలర్ల ద్వారా నగదు మార్పిడి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని కొన్ని కార్పోరేట్ సంస్థలు బోగస్ కాంట్రాక్టులు, బిల్స్తో పెద్ద ఎత్తున నగదును సమకూర్చుకున్నట్లు తేలిందని పేర్కొంది. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఎంట్రీ ఆపరేటర్లు, లాబీయిస్టులు, హవాలా డీలర్ల ద్వారా నగదుగా మార్చుకున్నట్లుగా వెలుగు చూసిందని తెలిపింది.
ఏపీ ప్రముఖుడికి రూ.150 కోట్లు
ఇలా నిధులు మళ్లించిన కంపెనీలు ఎక్కువగా ఢిల్లీ, ముంబైకి చెందినవిగా పేర్కొంది. అందులో ఓ కంపెనీపై ఏప్రిల్లో కూడా ఐటీ అదికారులు దాడులు నిర్వహించారు. బోగస్ బిల్స్తో ముడిపడిన పెద్ద ప్రాజెక్టులు ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. వీటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్లకు పైగా నగదు చెల్లించిన ఆధారాలు లభించినట్లు పేర్కొంది.
రూ.3,300 కోట్ల నిధుల మళ్లింపు
బడా కార్పోరేట్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల మధ్య ఉన్న రహస్య సంబంధాలు, ఈ వ్యవహారంతో లింక్ కలిగిన చైన్ సిస్టంకు సంబంధించిన విషయాలు వెలుగు చూసినట్లు CBDT తెలిపింది. బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ.3,300 కోట్ల నిధులను మళ్లించినట్లు పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో చేసిన సోదాల్లో రూ.4.19 కోట్ల బ్లాక్ మనీ, రూ.3.2 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకుంది.