Budget 2021-22: స్మార్ట్ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో కేంద్రం రాబడి పెంచుకునే అంశాలపై కూడా దృష్టి సారిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై, సంపన్నులపై సెస్ ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర ఉత్పత్తులు కూడా భారం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఈ భారం పెరిగే అవకాశముంది.
కస్టమర్లకు SBI గుడ్న్యూస్, ఆ వడ్డీ రేట్లు పెంపు: ఎన్ని రోజులకు ఎంత పెరిగాయంటే?
అందుకే పెంపు
రాబోవు కేంద్ర బడ్జెట్లో దిగుమతి చేసుకునే 50కి పైగా ఉత్పత్తులపై సుంకాలను ఐదు శాతం నుండి పది శాతం వరకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, ఇతర అప్లియెన్సెస్ ఉన్నాయి. అయితే దిగుమతి చేసుకునే ఉత్పత్తుల పైనే ఈ భారం పడే అవకాశముంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రధాని మోడీ దిగుమతి సుంకాలు పెంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో కరోనా వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాలు కూడా ఉంటాయి.
స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు భారం
మేడిన్ ఇండియా ఉత్పత్తులు పెరగాలంటే విదేశీ దిగుమతుల భారం తగ్గాలని, అప్పుడే దేశంలో ఉత్పత్తి పెరుగుతుందని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే దిగుమతి ఉత్పత్తులపై వచ్చే బడ్జెట్లో భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాలపై భారం పడే అవకాశముంది. గత ఏడాది పాదరక్షలు, ఫర్నీచర్, బొమ్మలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై 20 శాతం వరకు దిగుమతి సుంకాలను పెంచారు.
విదేశీ సంస్థలకు భారం
దిగుమతి సుంకం పెంపుతో ఖజానాకు రూ.20వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. సుంకాల పెంపు ప్రభావం ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వెహికిల్స్ పైన ప్రభావం పడవచ్చు. టెస్లా, ఐకియా వంటి సంస్థలకు షాక్ తగలవచ్చు.